యాప్నగరం

Weight Loss Surgery: 26 ఏళ్లకే 150 కిలోలు.. వెయిట్ లాస్ సర్జరీ వికటించి యువకుడు మృతి

Weight Loss Surgery: అధిక బరువుతో బాధపడుతున్న ఓ యువకుడు.. ఎలాగైనా బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి వెయిట్ లాస్ ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే బరువు తగ్గే ఆపరేషన్ చేసుకున్న ఆ యువకుడికి ఆరోగ్యం క్షీణించింది. దీంతో వేరే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆ యువకుడి ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించి.. విచారణకు ఆదేశించింది.

Authored byశివరామచారి తాటికొండ | Samayam Telugu 27 Apr 2024, 11:31 am
Weight Loss Surgery: కొంత మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు జిమ్, గ్రౌండ్‌లో కష్టపడటం, యోగా సెంటర్లకు వెళ్లడం, ఫుడ్ తగ్గించడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఊబకాయంతో బాధపడుతున్న ఓ యువకుడు.. అన్ని ప్రయత్నాలు చేసి.. చివరికి బరువు తగ్గే ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వివిధ ఆస్పత్రుల్లో వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఒక ఆస్పత్రిలో వెయిట్ లాస్ ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగా.. మరో ఆస్పత్రిలో కేవలం రూ.4 లక్షల్లోనే ఆపరేషన్ అవుతుందని తెలిపారు. దీంతో ఆ ఆస్పత్రిలో చేరిన యువకుడికి.. వెయిట్ లాస్ సర్జరీ జరుగుతుండగా.. తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Samayam Telugu Weight Loss Surgery
వెయిట్ లాస్ సర్జరీ వికటించి మృతి


తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పుదుచ్చేరికి చెందిన హేమచంద్రన్‌ బరువు తగ్గే ఆపరేషన్ జరుగుతుండగా ప్రాణాలు కోల్పోయాడు. హేమచంద్రన్‌ వయసు 26 ఏళ్లు కాగా.. బరువు మాత్రం 150 కిలోలు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్న హేమచంద్రన్.. చెన్నై పమ్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించాడు. ఏప్రిల్ 3 వ తేదీన ఆస్పత్రికి వెళ్లిన హేమచంద్రన్‌.. సర్జరీ చేయడానికి రూ.4 లక్షల ఖర్చు అవుతుందని తెలుసుకున్నాడు. అనంతరం అదే ఆస్పత్రిలో మెడికల్ టెస్ట్‌లు చేసిన డాక్టర్లు.. డయాబెటిస్ ఎక్కువగా ఉందని.. కొన్ని రోజుల తర్వాత రావాలని సూచించారు. దీంతో ఈ నెల 21 వ తేదీన ఆస్పత్రికి వెళ్లగా.. ఆ తర్వాతి రోజు సర్జరీ చేపట్టారు.

ఈ నెల 22 వ తేదీన ఉదయం 9:30 గంటలకు హేమచంద్రన్‌కు మెటబాలిక్, బేరియాట్రిక్ సర్జరీని డాక్టర్లు ప్రారంభించారు. అయితే ఆపరేషన్‌ చేస్తుండగానే హేమచంద్రన్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే డాక్టర్లు మరో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో హేమచంద్రన్ మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు శంకర్‌నగర్ పోలీస్స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని.. ఆ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇక ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. హేమచంద్రన్‌ మృతిపై విచారణకు ఆదేశించింది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం గురువారం హరిచంద్రన్ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. హేమచంద్రన్ మృతిపై పూర్తి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసులో యువకుడి మృతిపై విచారణకు ఇద్దరు జాయింట్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ఆదేశించింది. యువకుడి మృతిపై 2 రోజుల్లోగా విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇక ఆ హాస్పిటల్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
రచయిత గురించి
శివరామచారి తాటికొండ
శివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.