యాప్నగరం

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు తీవ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను సైన్యం మరింత ముమ్మరం చేసింది. గతవారం కాల్పుల విరమణకు స్వస్తి చెప్పడంతో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను సైన్యం తిరిగి ప్రారంభించింది.

TNN 22 Jun 2018, 12:32 pm
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను సైన్యం మరింత ముమ్మరం చేసింది. గతవారం కాల్పుల విరమణకు స్వస్తి చెప్పడంతో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను సైన్యం తిరిగి ప్రారంభించింది. శుక్రవారం ఉదయం దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అనంత్‌నాగ్ జిల్లా శ్రీగుఫ్వారాలో ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న భద్రతా దళాలు శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో సైన్యం అప్రమత్తమైంది. ఈ క్రమంలో తీవ్రవాదులు, సైన్యం మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఐఎస్ జమ్మూ కశ్మీర్ విభాగానికి చెందిన ముగ్గురు తీవ్రవాదులు హతమైనట్టు డీజీపీ ఎస్పీ వైద్ వెల్లడించారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీస్ కూడా అమరుడవగా, వారు తలదాచుకున్న ఇంటి యజమాని సైతం కాల్పుల్లో మరణించినట్టు తెలియజేశారు. ఈ ఘటనలో ఓ మహిళతోపాటు ఇద్దరు గాయపడ్డారు.
Samayam Telugu కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్


హతమైనవారిలో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది ఖాసీమ్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అనంత్‌నాగ్, శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భదత్రాదళాలపై అల్లరి మూకలు రాళ్లదాడికి పాల్పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. రాళ్లదాడులకు పాల్పడిన వారిని నిలువరించడానికి సైన్యం అదనపు బలగాలను ఉపయోగించింది. ఈ సమయంలో కొంత మంది పౌరులు గాయపడినట్టు తెలుస్తోంది.

రంజాన్ సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను కేంద్రం నిలిపివేయడంతో గతంలో ఎన్నడూలేని విధంగా కశ్మీర్‌లో ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. పండుగ రోజు సైతం ఉగ్రమూకలు దాడులకు పాల్పడటంతో ఈద్ ముగిసిన మర్నాడే కాల్పుల విరమణ నిలిచిపోయినట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో నెల రోజుల పాటు ఎంతో సంయమనంతో ఉన్న సైన్యం ఉగ్రవాదుల వేటను తిరిగి ఆరంభించింది. మంగళవారం నాడు పుల్వామాలో ముగ్గురు జైషే మహ్మద్ తీవ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చింది. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో జమ్మూ కశ్మీర్‌లో పాలన గవర్నర్ చేతిలోకి వెళ్లింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.