యాప్నగరం

కశ్మీర్‌లో నలుగురు తీవ్రవాదులను హతమార్చిన సైన్యం

ఉగ్రవాదుల ఏరివేత చర్యలను ముమ్మరం చేసిన సైన్యం వారిపై మెరుపుదాడులు చేస్తోంది. నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఉగ్రవాద స్థావరాలపై జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా దాడులు చేస్తున్నారు.

TNN 21 Mar 2018, 8:50 am
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వావారా జిల్లా అరంపొరా ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు గుర్తుతెలియని తీవ్రవాదులు హతమైనట్టు రక్షణశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఉగ్రవాద చొరబాట్ల ప్రధాన కేంద్రాల్లో ఒకటైన అరంపొర, హల్మత్‌పొర అటవీ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని ఆయన తెలియజేశారు. చాలా మంది తీవ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ముష్కరుల హతమవగా, మరో ఉగ్రవాది గాయపడినట్టు తెలిపాయి. ఐదుగురు ఉగ్రవాదులు ఇటీవలే కశ్మీర్‌లోకి చొరబడ్డారని, వాళ్లను తీసుకురావడానికి మరో ఇద్దరు తీవ్రవాదులు ఇక్కడకు వచ్చారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Samayam Telugu 4 terrorists gunned down in jammu and kashmirs kupwara district
కశ్మీర్‌లో నలుగురు తీవ్రవాదులను హతమార్చిన సైన్యం


హల్మత్‌పొర గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించింది... ఈ సమయంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరిగాయని పోలీస్ అధికారులు తెలియజేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఉగ్రవాదులను గుర్తించలేదని, వారు ఎవరనేది బుధవారం తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్‌లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో కనీసం 28 మంది ఉగ్రవాదులు హతమవగా, 15 మంది సైనికులు, 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.