యాప్నగరం

ఎర్నాకుళం: ఒక్కరోజులో 54 వేల మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు

కేరళ వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ చర్యలను రెస్క్యూ బృందాలు మరింత వేగవంతం చేశాయి.

Samayam Telugu 19 Aug 2018, 6:10 pm
కేరళ వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ చర్యలను రెస్క్యూ బృందాలు మరింత వేగవంతం చేశాయి. ఎర్నాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను కాపాడి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి. ఎర్నాకుళం జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న పునరావాస కేంద్రాలతో పాటు కొత్తగా మరికొన్నింటిని ఏర్పాటు చేశారు. ఎర్నాకుళం జిల్లాలో శనివారం ఒక్కరోజే 54,800 మందిని కాపాడి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
Samayam Telugu Floods


వీళ్లలో 15 మందిని ఎయిర్ ఫోర్స్, 237 మందిని నేవీ బృందాలు కాపాడాయి. హెలీకాప్టర్ల ద్వారా వీళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక 10,410 మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఫిషింగ్ బోట్లు, స్పీడు బోట్ల సాయంతో వాళ్లను కాపాడారు. ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా 738 మందిని కాపాడినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. మిగిలినవారిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస కేంద్రాలకు పంపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన మొత్తం 153 బోట్లు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నాయి.

ఇదిలా ఉండగా, ఎర్నాకుళంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలకు శనివారం సాయంత్రం వరకు 10,800 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. అలాగే రెండు హెలీకాప్టర్ల ద్వారా 5,500 ఆహార పొట్లాలను జారవిడిచారు. జిల్లాలో మొత్తం 597 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 47,138 కుటుంబాలకు చెందిన 1,81,607 మంది ఈ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.