యాప్నగరం

ల్యాండ్‌మైన్ పేల్చిన నక్సల్స్.. ఏడుగురు జవాన్లు బలి

ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగలడంతో రగిలిపోతున్న మావోయిస్టులు అదునుకోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఝార్ఖండ్‌లోని చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఘాతుకానికి ఏడుగురు పోలీసులు బలయ్యారు.

Samayam Telugu 27 Jun 2018, 8:41 am
ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగలడంతో రగిలిపోతున్న మావోయిస్టులు అదునుకోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఝార్ఖండ్‌లోని చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఘాతుకానికి ఏడుగురు పోలీసులు బలయ్యారు. గర్హా జిల్లాలో ల్యాండ్‌మైన్ పేల్చిన ఘటనలో ఝార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఏడుగురు జవాన్లు మృతిచెందారు. గర్హా జిల్లా చింజో అటవీ ప్రాంతంలో కొందరు మావోయిస్టులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం అక్కడకు బయలుదేరినట్టు డీఐజీ విపుల్ శుక్లా తెలిపారు. పోలీసులు ప్రయాణిస్తోన్న వాహనాన్ని మార్గమధ్యంలో ల్యాండ్‌మైన్‌తో పేల్చిన నక్సల్స్, కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు గాయపడ్డారని డీఐజీ పేర్కొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపామని ఆయన తెలియజేశారు.
Samayam Telugu మావోయిస్టులు


మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు సాగుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇటీవలే భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు ప్రారంభించారు. గెరిల్లా పోరాటాలకు సురక్షితమైన రహస్య స్థావరంగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. సీఆర్పీఎఫ్, జార్ఖండ్ జాగ్వార్ పోలీసులు సంయుక్తంగా మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించిన తుమేరా గ్రామానికి సమీపంలోనే ప్రస్తుతం నక్సల్స్ దాడిచేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఝార్ఖండ్‌లో జరిగిన అతిపెద్ద మావోయిస్ట్ దాడి ఇదే కావడం గమనార్హం. గతంలో 2016 జనవరి 27 న పలము జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
ల్యాండ్‌మైన్ పేల్చిన నక్సల్స్.. ఏడుగురు జవాన్లు బలి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.