యాప్నగరం

నక్సల్స్ మెరుపుదాడి.. 8 మంది జవాన్లు మృతి

ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు అదును చూసి దెబ్బకొట్టారు. అత్యంత శక్తివంతమైన మందుపాతరను పేల్చి 8 మంది జవాన్లు పొట్టనబెట్టుకున్నారు.

TNN 13 Mar 2018, 3:22 pm
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 8 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు. ఈ ఘటనలో మరో పది మంది గాయపడ్డారు. సుక్మా జిల్లా బస్తర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ దళాలు ప్రయాణిస్తోన్న వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు అదును చూసి దెబ్బకొట్టారు. కిష్టరాం ప్రాంతంలో 212 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కూబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఈ ఘతాకానికి తెగబడ్డారు. ఈ ఘటనలో 8 జవాన్లు మృతిచెందగా, పదిమంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను వైద్యం కోసం రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu 8 crpf personnel martyred in naxal attack in chhattisgarhs sukma district
నక్సల్స్ మెరుపుదాడి.. 8 మంది జవాన్లు మృతి


జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుక్మా జిల్లాలో ఆపరేషన్ కొనసాగుతుండగా మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నక్సల్స్‌ ఎదురుపడ్డారు.. ఇంతలో వారిపై జవాన్లు కాల్పులు జరపగా, కోబ్రా దళానికి చెందిన సభ్యులు తప్పించుకున్నారని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి మోసెస్ దినకరన్ తెలిపారు. అనంతరం మధ్నాహ్నం 12.30 గంటల సమయంలో 212 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకున్న మరో మావోయిస్టుల బృందం కిస్టారం- పలోడి మధ్య మైన్ ప్రొటెక్టెట్ వాహనాన్ని శక్తివంతమైన మందుపాతరతో పేల్చేసిందని ఆయన తెలియజేశారు.

పదకొండు రోజుల కిందట తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పూజారికాంకేడులో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్‌కు చెంది ఓ కానిస్టేబుల్‌ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఆరు మాసాల తర్వాత మావోయిస్టులు జరిపిన అతిపెద్ద మెరుపుదాడి ఇదే. గతేడాది మార్చిలో సుక్మా ప్రాంతంలో రహదారి నిర్మాణం కార్మికులకు కాపాలాగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ల క్యాంప్‌పై మావోలు దాడిచేసిన ఘటనలో 12 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన తర్వాత మరింత అప్రమత్తమైన సైన్యం, నక్సల్స్ చర్యలను సమర్థంగా తిప్పికొడుతోంది. గత రెండేళ్లలో చత్తీస్‌గఢ్‌లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో సుమారు 300 మందికి పైగా నక్సల్స్ హతమైనట్టు ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర హోంమంత్రి రామేశ్వక్ పైక్రా అసెంబ్లీలో ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.