యాప్నగరం

కనిమొళి 6 నెలలు, రాజా 15 నెలలు!

దేశ చరిత్రలోనే అత్యంత భారీ స్కామ్ గా పేర్గాంచిన 2జీ స్కామ్ లో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం అని వేరే చెప్పనక్కర్లేదు.

TNN 21 Dec 2017, 11:54 am
దేశ చరిత్రలోనే అత్యంత భారీ స్కామ్ గా పేర్గాంచిన 2జీ స్కామ్ లో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం అని వేరే చెప్పనక్కర్లేదు. లక్షా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ గా పేర్గాంచిన 2జీ నుంచి ఇప్పుడు ప్రధాన నిందితులంతా నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ తీర్పుపై హై కోర్టుకు వెళ్తామని సీబీఐ అంటున్నప్పటికీ.. అదంతా తర్వాతి సంగతి. నిన్నటి వరకూ ఈ కేసులో నిందితులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజా, తమిళనాడు సీఎం కరుణానిధి తనయ- ఎంపీ కనిమొళిలు నిర్దోషులు అయ్యారిప్పుడు. అయితే ఈ కేసుల్లో వారు ఎదుర్కొన్నది కేవలం అభియోగాలు మాత్రమే కాదు.. జైలు శిక్షను కూడా అనుభవించారు వీరిద్దరూ.
Samayam Telugu a raja kanimozhi 15 others acquitted in 2g case
కనిమొళి 6 నెలలు, రాజా 15 నెలలు!


2జీ స్కామ్ కాగ్ నివేదికతో వెలుగులోకి వచ్చింది. దీనిపై నాటి జనతా పార్టీ నేత, ఇప్పటి బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లతో ఈ వ్యవహారంపై యూపీఏ టర్మ్ లోనే సీబీఐ విచారణ మొదలైంది. విచారణకు 2జీ స్కామ్ నాటి టెలికాం మంత్రి అయిన రాజాను పిలిపించారు. అలాగే ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని కనిమొళిని కూడా రప్పించారు. అనంతరం వారిని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.

రాజా ని 15 నెలల పాటు తీహార్ జైల్లో పెట్టారు. అప్పటికి తమిళనాడు సీఎంగా కరుణానిధి ఉన్నా ఆయన తనయను అరెస్టు చేశారు. ఆమెను కూడా ఆరు నెలల పాటు తీహార్ జైల్లోనే పెట్టారు. అనేక పిటిషన్ల అనంతరం వీళ్లకు బెయిల్ దక్కింది. తీహార్ జైల్లో వీళ్లను సాధారణ ఖైదీలుగానే పరిగణించడం కూడా అప్పట్లో సంచలనంగా నిలిచింది. ఇప్పుడు సీబీఐ కోర్టు వీరిని నిర్దోషులుగా తేల్చడంతో వీరు ఆనందంగా ఉన్నారు. డీఎంకే పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.