యాప్నగరం

అమెరికా ఆర్మీతో కలిసి చైనాకు చెక్!

మోదీ ఇంతకు ముందరి లాంటి నాయకుడు కాదని.. భారతీయుల అభీష్టం, భారత్ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడే తెగింపు ఉన్న నేత అని..

TNN 8 Aug 2017, 12:45 pm
సరిహద్దులో కవ్వింపు చర్యలతో తలనొప్పులు తెస్తున్న చైనాకు గట్టిగా బదులిచ్చేందుకు.. భారత్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నెల (సెప్టెంబర్)లో అమెరికాతో కలిసి సైనిక ప్రదర్శన చేయడానికి ప్రణాళిక ఖరారైంది. జులైలో జపాన్‌తో కలిసి బంగాళా ఖాతం తీరంలో ‘మలబార్ నావెల్ వార్ గేమ్’ విన్యాసాలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాతోనూ ‘యుద్ధ్ అభ్యాస్’ పేరుతో భారీ సైనిక ప్రదర్శనకు తెరలేపి, అమెరికాతో రక్షణ అంశాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా మరో ముందడుగు వేయడంతో పాటు.. చైనాకు గట్టి హెచ్చరికలు పంపాలని భారత్ భావిస్తోంది.
Samayam Telugu after malabar india us gear up for september military drill
అమెరికా ఆర్మీతో కలిసి చైనాకు చెక్!


రక్షణపరంగా భారత్ తమకు ప్రధాన భాగస్వామి అని అమెరికా పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా-పసిఫిక్ రీజియన్లో రక్షణపరంగా భారత్‌ను ప్రధాన భాగస్వామిగా చూస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. గత జూన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ సందర్భంగా రక్షణ అంశాల్లో సహకారం పెంపొందించుకునే దిశగా మరింత కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు.

అమెరికాలో సెప్టెంబర్ 14 నుంచి 27 మధ్య నిర్వహించతలపెట్టిన ఈ సంయుక్త సైనిక ప్రదర్శన ఇరు దేశాల సైన్యాల బలోపేతానికి ఎంతగానో తోడ్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఏవిధంగా సహకరించుకోవాలనే అంశానికి సంబంధించి దీని ద్వారా ఇరు దేశాల సైన్యానికి మంచి అవగాహన కూడా ఏర్పడుతుందని భావిస్తున్నారు. అంతిమంగా ఈ చర్యలన్నీ భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైన చైనాకు చెక్ పెట్టడానికేనని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ చైనాతో యుద్ధమే గనుకవస్తే.. భారత్‌ పక్షాన నిలబడటానికి అమెరికా ముందు వరసలో ఉంటుందనే సంకేతాలు ఇవ్వడం.. తాజా సైనిక విన్యాసాల ఉద్దేశమని​ పలువురు యూఎస్ విశ్లేషకులు అంటున్నారు. మోదీ ఇంతకు ముందరి లాంటి నాయకుడు కాదని.. భారతీయుల అభీష్టం, భారత్ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడే తెగింపు ఉన్న నేత అని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే.. చైనాతో ఇప్పుడున్న పరిస్థితులు యుద్ధం వరకూ వెళ్లేవి కావని, చర్చల ద్వారా పరిష్కరించుకోగలిగేవేనని వారంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.