యాప్నగరం

కేంద్రం నుంచి వైదొలగిన అకాళీదళ్.. తీవ్ర ఒత్తిడిలో హరియాణాలోని బీజేపీ మిత్రపక్షం

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లులపై రాజకీయ రగడ చెలరేగింది. విపక్షాల నుంచే కాక, ఎన్డీయే మిత్రపక్షాల నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Samayam Telugu 18 Sep 2020, 4:06 pm
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తున్న ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్ (ఎస్ఏడీ).. ప్రభుత్వం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న హరిసిమ్రత్ కౌల్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా, మరో మిత్రపక్షం ఈ బిల్లులను వ్యతిరేకిస్తోంది. హరియాణాలో సంకీర్ణ ప్రభుత్వానికి జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) మద్దతు ఇస్తోంది. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో జేజేపీ అధినేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు.
Samayam Telugu దుష్యంత్ చౌతాలా
Deputy CM of Haryana Dushyant Chautala (File)


అనంతరం తన పార్టీ అగ్రనేతలతో కీలక సమావేశం నిర్వహించారు. మొత్తం 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో గతేడాది ఎన్నికల్లో జేజేపీ 10 స్థానాల్లో విజయం సాధించి, కింగ్ మేకర్‌గా అవతరించింది. కేంద్ర మంత్రి పదవికి హరిసిమ్రత్ కౌర్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే దుష్యంత్‌ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘దుష్యంత జీ హరసిమ్రత్ కౌర్‌ బాదల్‌ను అనుసరించి కనీసం డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయండి.. రైతుల కంటే మీకు పదవే ఎక్కువయినట్టుంది’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విమర్శలు గుప్పించారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ సంస్కరణ బిల్లులను వ్యతిరేకిస్తోన్న అకాళీదళ్, జేజేపీ మధ్య అనేక సారుప్యతలున్నాయి. చౌతాలా, బాదల్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలుండగా.. ఈ రెండు పార్టీలూ తమ తమ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్నాయి. ఎస్ఏడీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. దేశంలోని గొప్ప రైతు నాయకుల్లో మాజీ ఉప-ప్రధాని దేవీలాల్ ఒకరని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హరియాణాలో బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంలో బాదల్ కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం అకాళీదళ్ రైతుల పక్షాన నిలబడటంతో రైతుల ఆందోళనలు జేజేపీని ఆత్మరక్షణలో పడేశాయి. వ్యవసాయ ఆర్డినెన్స్‌లకు జేజేపీ మద్దతిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ రైతులను తప్పుదోవ పట్టిస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. అయితే, ఈ బిల్లుల విషయంతో తన వైఖరి మార్చుకోడానికి ముందు అకాలీదళ్ కూడా ఇటువంటి ఆరోపణలే చేసింది. సెప్టెంబరు 10న కురుక్షేత్రలో ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో జేజేపీ చిక్కుల్లో పడింది.

ఈ ఘటనలో అనేక మంది గాయపడగా.. రైతులు గొంతును నొక్కేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షం ఆరోపించింది. ఇదే సమయంలో అధినేత దుష్యంత చౌతాలా వైఖరిపై బాహటంగా విమర్శలు గుప్పించే జేజేపీ ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతోంది. మొన్న ఎమ్మెల్యే రామ్ కుమార్ గౌతమ్, నేడు దేవేందర్ బాబ్లీ విమర్శలు గుప్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.