యాప్నగరం

Modi Cabinet: మోదీ కొత్త కేబినెట్‌లో అమిత్‌ షా?.. ఈ సారి వారికి అవకాశం లేనట్లే!

ఈసారి మోదీ కేబినెట్‌లో కొత్తవారికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు మోదీ టీమ్‌లో కీలకమైన పదవి లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 25 May 2019, 8:24 am

ప్రధానాంశాలు:

  • ఎన్నికల్లో పోటీకీ దూరంగా ఉన్న అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్
  • మంత్రి పదవిపై ఆసక్తి లేదన్న అరుణ్ జైట్లీ
  • అమిత్‌షాకు కీలకమైన హోం, ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖల్లో ఏదో ఒకటి అప్పగించే అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Amit-Shah
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయాన్ని సొంతచేసుకున్న బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. మే 30న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అదేరోజు కేబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై శనివారం (మే 25) జరగనున్న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశం జరగనుంది. అయితే అంతకు ముందే బీజేపీ ఎంపీలు ప్రత్యేకంగా సమావేశంకానున్నారు.
ఈసారి మోదీ కేబినెట్‌లో కొత్తవారికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు మోదీ టీమ్‌లో కీలకమైన పదవి లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన విషయం తెలిసిందే. వీరికి కొత్త మంత్రివర్గంలో చోటు లభించకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్‌షాకు కీలకమైన హోం, ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖల్లో ఏదో ఓ మంత్రిత్వశాఖ బాధ్యతలు లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు అమేథీలో రాహుల్‌గాంధీపై ఘనవిజయం సాధించిన స్మృతి ఇరానీ, రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలాసీతారామన్‌‌కు కూడా మంత్రి వర్గంలో కీలక పదవులు దక్కే అవకాశముంది. వీరితోపాటు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌గడ్కరీ, రవిశంకర్‌ ప్రసాద్‌, పీయుష్‌గోయెల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రకాశ్‌ జవదేకర్‌ తదితరులకు మోదీ కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాల్లో శివసేన, జేడీ(యు)లకూ కూడా కేబినెట్‌లో కీలక స్థానం లభించే అవకాశం ఉంది. అసాధారణ స్థాయిలో సీట్లను కైవసం చేసుకున్న తెలంగాణ, కర్ణాటక, బెంగాల్‌ రాష్ట్రాలకు కూడా మోదీ మంత్రివర్గంలో సముచిత స్థానం లభించనున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.