యాప్నగరం

హనుమాన్ చాలీసా వివాదం... నవనీత్ రాణా దంపతులు అరెస్ట్

ఒక ప్రకటనతో నవనీత్ రాణా దంపతులు చిక్కుల్లో పడ్డారు. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలిసా పారాయణం చేస్తామని ప్రకటించి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. శివసేన కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. తర్వాత ఇద్దరు తమ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. అయినా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆదివారం వారిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయితే నవనీత్ కౌర్ రాణా దంపతులు బెయిల్ కోసం దరఖాస్తు చేయకూడదని, అవసరమైతే జైలుకు పోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 24 Apr 2022, 9:46 am

ప్రధానాంశాలు:

  • హాట్‌టాపిక్‌గా నవనీత్ రాణా, రవి రాణా
  • ఇండిపెండెంట్‌గా గెలిచిన దంపతులు
  • 2011లో పెళ్లి చేసుకున్న నవనీత్, రవిరాణా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతికాత్మక చిత్రం
మహారాష్ట్రలో సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. వారు శుక్రవారం చేసిన ఓ ప్రకటన పెద్ద దుమారాన్ని రేపింది. వారిద్దరిని కటకటాలపాలు చేసింది. సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని నవనీత్ కౌర్ రాణా ప్రకటించారు. దాంతో శివసేన కార్యకర్తలు శనివారం ఆమె ఇంటిని చుట్టుముట్టి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకున్నా నవనీత్‌ కౌర్ దంపతులను బయటకు రావొద్దని కోరారు. దాంతో నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాలు వెనక్కి తగ్గి.. ప్రధాని పర్యటన నేపథ్యంలో తమ ప్రయత్నాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయినా వివాదానికి తెరపడలేదు. శనివారం సాయంత్రం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
  • నేడు కోర్టు ముందు హాజరు..
భిన్న వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారనే కారణంతో నవనీత్ రాణా దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద ఖర్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు కూడా పెట్టారు. ఈ మేరకు ఆదివారం వారిని బాంద్రా కోర్టు హాలిడే బెంచ్ ముందు హాజరుపరచనున్నారు. అయితే ఈ కేసులో బెయిల్‌ కోసం అప్లై చేయకూడదని, అవసరమైతే జైలుకు వెళ్లాలని నవనీత్ కౌర్ దంపతులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన నేతలు అనిల్ పరబ్, సంజయ్ రౌత్ తమ నివాసం వెలుపల ఉన్న 700 మందిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఇద్దరు ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

  • మోడలింగ్‌ టూ పాలిటిక్స్..
ఈ వివాదంతో నవనీత్ కౌర్ దంపతులు ఒక్కసారి హాట్‌టాపిక్‌గా మారిపోయారు. వాస్తవానికి రవి రాణా, నవనీత్ ‌కౌర్‌లు ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి గెలిపొందారు. రవి బద్రేరా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రవి స్వస్థలం అమరావతిలో శంకర్‌నగర్. బీకాం చేశారు. ఇక నవనీత్‌ కౌర్ సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. పంజాబ్‌కు చెందిన ఆమె ముంబైలోనే ఉండేవారు. పలు భాషా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. టాప్ హీరోల సరసన నటించింది. మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి... తర్వాత రాజకీయ నాయకురాలుగా ఎదిగారు. నవనీత్ కౌర్ 2019 అమరావతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఓ సామూహిక వేడుకలో నవనీత్ కౌర్, రవి రాణాలు 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు యువ స్వాభిమాన్ పార్టీని కూడా నడుపుతున్నారు. బీజేపీకి మద్దతుగా నడుచుకుంటున్నారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.