యాప్నగరం

యాంటీ స్టెరిలైట్ ఉద్యమం.. ట్యుటికోరిన్ ఉద్రిక్తం

తమిళనాడులోని ట్యుటికోరన్ అట్టుడుకుతోంది. మంగళవారం (మే 22) ఉదయం జరిగిన ఘర్షణల్లో ఆరుగురు వ్యక్తులు మరణించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Samayam Telugu 22 May 2018, 4:20 pm
తమిళనాడులోని ట్యుటికోరన్ అట్టుడుకుతోంది. మంగళవారం (మే 22) ఉదయం పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు వ్యక్తులు మరణించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికంగా ఉన్న ఉన్న స్టెరిలైట్ కాపర్ పరిశ్రమను మూసేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ట్యుటికోరన్‌వాసులు గత 100 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంగళవారం ఆందోళన 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా పోరాటాన్ని తీవ్రతరం చేశారు.
Samayam Telugu tn


పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు కలెక్టర్ ముట్టడి, రాస్తారోకోలతో అలజడి సృష్టించారు. వీరిని అడ్డుకోడానికి భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ట్యుటికోరిన్ పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినా.. ఖాతరు చేయకుండా ప్రజలు తమ ఆందోళన కొనసాగించారు.

ఆందోళనకారులను అడ్డుకోడానికి ప్రయత్నించడంతో పోలీసులపైకి వారు రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులకు, ఆందోళనకారులకు జరిగిన ఘర్షణల్లో తమిళరాసన్ (50 ఏళ్లు) అనే వ్యక్తి మరణించారు. పురట్చికార ఇలంగార్ మున్నాని అనే సంస్థ తరఫున ఈయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మరో 5 మంది మరణించారు.

నిరసనకారుల మృతి వార్తతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పలు ప్రభుత్వ భవనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. ట్యుటికోరిన్ పట్టణమంతా దట్టమైన పొగ కమ్ముకుందంటే.. పరిస్థితి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మరిన్ని భద్రతా బలగాలను రంగంలోకి దించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.