యాప్నగరం

బీజేపీ నేతల హత్యతో కశ్మీర్‌లో ఉద్రికత్త.. రంగంలోకి ఆర్మీ

కిష్టావర్‌లో ​​2001లో హిందువులే లక్ష్యంగా తీవ్రవాదులు మత ఘర్షణలకు ఆజ్యం పోసి, దాడులకు పాల్పడి 17 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇక, 2013 ఆగస్టులోనూ అల్లర్లు చెలరేగాయి.

Samayam Telugu 2 Nov 2018, 3:49 pm
జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అనిల్ పరిహార్, అతడి సోదరుడు అజిత్‌లు ఉగ్రవాదుల చేతిలో గురువారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలతో కిష్టావర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. దీంతో కిష్టావర్‌లో కర్ఫ్యూ విధించి, పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను మొహరించారు. గురువారం రాత్రి అనిల్‌ పరిహార్‌, అజిత్‌లు తమ దుకాణం నుంచి ఇంటికి వస్తుండగా ఉగ్రవాదులు మధ్యలో అడ్డగించి కాల్చి చంపారు. నెల వ్యవధిలోనే రాజకీయ నేతలపై జరిగిన మూడో దాడి ఇది. గతంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి చెందిన ఇద్దరు, ఓ పీడీపీ నేతను ముష్కరులు హతమార్చారు. తాజా ఘటనతో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడమే కాదు, పోలీసులపై దాడులకు కూడా దిగుతున్నారు. దీనిపై కిష్టావర్ జిల్లా కలెక్టర్ అంగ్రేజ్ సింగ్ రాణా మాట్లాడుతూ... ఉద్రిక్తంగా ఉన్నా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Samayam Telugu army-


కిష్టావర్ పట్టణంలో శాంతి భద్రతల అదుపుచేయడానికి సైనిక బలగాలు కవాతు నిర్వహించాయని తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి కర్ఫ్యూ విధించామని, పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు సెక్యూరిటీ ఏర్పాటుచేశామని ఆయన తెలియజేశారు. మరోవైపు బీజేపీ నేతలను హతమార్చిన నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని ప్రత్యేక ఎస్పీ రాజేంద్ర గుప్తా వెల్లడించారు. కిష్టావర్‌లో మతపరమైన ఉద్రిక్తలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భద్రతను ఉన్నతాధికారుల పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. అల్లర్లు జరగకుండా ఆర్మీ పెద్ద ఎత్తున తరలించారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు హింసాత్మక ఘటనలను సృష్టించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

2001లో కిష్టావర్‌లో హిందువులే లక్ష్యంగా తీవ్రవాదులు మత ఘర్షణలకు ఆజ్యం పోసి, దాడులకు పాల్పడి 17 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇక, 2013 ఆగస్టులోనూ అల్లర్లు చెలరేగాయి. మరోవైపు బీజేపీ నేతల హత్యలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. ఘటన గురించి జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సలహాదారు విజయ్‌ కుమార్‌తో మాట్లాడినట్లు రాజ్‌నాథ్ తెలిపారు.

స్టేషనరీ దుకాణం నిర్వహించే బీజేపీ నేత అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్‌లు షాపు నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరారు. మార్గమధ్యంలో తపల్ గలి మోహళ్లా వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుంచి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో సోదరులిద్దరూ కుప్పకూలిపోగా, స్థానికులు వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే, వారు అప్పటికే చనిపోయారని వైద్యులు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.