యాప్నగరం

సామాన్యుడి సీఎం.. అక్కడ కిలో ఉల్లిపాయలు రూ.24 మాత్రమే !

ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో ఉల్లి ధర రూ.60 దాటింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే ఉల్లిని విక్రయించాలని నిర్ణయించింది.

Samayam Telugu 27 Sep 2019, 6:40 pm
ఉల్లిపాయ ధరలు సామాన్యుడికి కంటతడి పెట్టిస్తున్నాయి. కిలో ఉల్లిపాయ రూ.60-80 వరకు పలుకుతోంది. దీంతో ఉల్లి కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గడమే ఉల్లి ధరలు పెరగడానికి కారణమైంది. ఉల్లి ధర నుంచి ఉపశమనం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాలు మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిని రూ.23.90కే విక్రయిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. శనివారం నుంచి ఒక్కో కుటుంబానికి ఐదు కిలోల చొప్పున తగ్గింపు ధరలకే ఉల్లిని విక్రయిస్తామన్నారు.
Samayam Telugu onion


అసెంబ్లీ స్థానానికి ఒకటి చొప్పున 70 మొబైల్ వ్యాన్లు, 400 రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయలను విక్రయిస్తామని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. ఇందుకోసం కేంద్రం నుంచి లక్ష కిలోల ఉల్లిపాయలను కొనుగోలు చేస్తామన్నారు. ఉల్లి రేట్లు సాధారణ స్థాయికి వచ్చే వరకు తగ్గింపు ధరలకు విక్రయిస్తామన్నారు.

ఉల్లిపాయల నాణ్యతను పరిశీలించడం కోసం ఇద్దరు ఉద్యోగులను నాసిక్ పంపామని కేజ్రీవాల్ తెలిపారు. ఉల్లిని బ్లాక్‌మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. కాగా మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. పరిమితికి లోబడి ఇళ్లకు ఉచిత విద్యుత్, మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి ఎన్నో ఆకర్షణీయ పథకాలను కేజ్రీవాల్ తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఉల్లిపాయలను కూడా తమకు అనుకూలంగా వాడుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.