యాప్నగరం

షాకింగ్: చైనాతో ఘర్షణల్లో 20 మంది జవాన్ల వీరమరణం

Ladakh: గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో భారత జవాన్లు భారీ సంఖ్యలో మరణించినట్లు తెలుస్తోంది. కనీసం 20 మంది సైనికులు వీరమరణం పొందారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.

Samayam Telugu 17 Jun 2020, 12:03 am
చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో భారత్‌కు చెందిన జవాన్లు పెద్ద సంఖ్యలో అమరులైనట్లు తెలుస్తోంది. కనీసం 20 మంది సైనికులు వీర మరణం చెందినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ మంగళవారం (జూన్ 16) రాత్రి ట్వీట్ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించింది. చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు అమరులైనట్లు ఆర్మీ అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు.
Samayam Telugu లఢక్
China Vs India


భారత్‌ - చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లఢక్‌లోని 1400 అడుగుల ఎత్తైన గాల్వన్‌ లోయ రక్తసిక్తమైంది. సోమవారం (జూన్ 15) రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. జవాన్లు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో భారత్‌కు చెందిన ఒక కల్నల్‌ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరు జవాన్లు అమరులైనట్లు ఇండియన్ ఆర్మీ మంగళవారం మధ్యాహ్నం తెలిపింది. అయితే.. ఘర్షణల్లో 20 మందికి పైగా మరణించినట్లు ఏఎన్‌ఐ మంగళవారం రాత్రి ట్వీట్ చేసింది.

చైనా వైపున కూడా భారీ సంఖ్యలో సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. ఘర్షణలో డ్రాగన్‌కు చెందిన 43 మంది జవాన్లు మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఏఎన్ఐ పేర్కొంది. భారత జవాన్లు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా చైనా భూభాగంలోకి వచ్చి తమ జవాన్లపై దాడి చేశారని చైనా సంచలన ఆరోపణలు చేస్తోంది.

భారత్, చైనా సరిహద్దుల్లో 5 వారాలుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్యాంగ్యాంగ్ త్సో, గాల్వాన్ లోయ, దేమ్‌చోక్, దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. మే నెల ప్రారంభం నుంచే చైనా.. వాస్తవాధీన రేఖ వెంట తన బలగాలను పెంచుతోంది. అక్కడికి అదనపు బలగాలను తరలించింది. భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులు మోహరించింది. సరిహద్దు వెంట పలు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. డ్రాగన్ ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నట్లు కనిపిస్తోంది.



Must Read: గాల్వాన్ లోయలో ఏం జరుగుతోంది.. చైనా ప్లాన్ ఏంటి?

Don't Miss: కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి కల్నల్ స్థాయికి.. సంతోష్‌కు ఏపీ నేతల నివాళి

Also Read: నా కుమారుడు దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉంది: కల్నల్ సంతోశ్ తల్లి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.