యాప్నగరం

వాజ్‌పేయ్ మరణం.. బంగ్లా ప్రజలకు అత్యంత బాధాకరమైన రోజు: షేక్ హసీనా

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తన వ్యక్తిత్వంతో కేవలం భారతీయుల మనసులే కాదు, పాక్ ప్రజల అభిమానాన్ని సైతం చూరగొన్నారు.

Samayam Telugu 17 Aug 2018, 8:13 am
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తన వ్యక్తిత్వంతో కేవలం భారతీయుల మనసులే కాదు, పాక్ ప్రజల అభిమానాన్ని సైతం చూరగొన్నారు. ఇక బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఆయన సేవలు నిరుపమానమని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని వ్యాఖ్యానించారంటే అక్కడ వారికి వాజ్‌పేయి అంటే ఎంత గౌరవమో ఇట్టే అర్థమవుతుంది. అందుకే బంగ్లా ప్రభుత్వం ఆయనకు ఆ దేశ అత్యున్నత పురస్కారం బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆనర్‌తో 2015లో సత్కరించింది. వాజ్‌పేయి మరణం తనను షాక్‌కు గురిచేసిందని బంగ్లా ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన హసీనా, భారత్ ఓ గొప్ప రాజనీతిఙ్ఞుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన సేవలను భారతీయులు చిరకాలం గుర్తుంచుకుంటారని, సుపరిపాలన అందించి సామాన్యుల మనసులు గెలుచుకోవడమే కాదు, దక్షిణాసియాలో శాంతి, శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.
Samayam Telugu అటల్ బిహారీ వాజ్‌పేయి


భారతదేశ ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వాజ్‌పేయి రాబోయే తరాల నేతలకు స్ఫూర్తిగా నిలిచారని ఆమె కొనియాడారు. స్వతహాగా గొప్ప వక్త, కవి అయిన వాజ్‌పేయి భారత్ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని హసీనా ప్రశంసించారు. ‘అటల్ జీ బంగ్లాదేశ్‌కు గొప్ప స్నేహితుడు.. ఆయనంటే బంగ్లా పౌరులకు ఎంతో గౌరవం.. బంగ్లా విముక్తి పోరాటంలో ఆయన సహకారం మరువలేనిది.. తమ స్వాతంత్ర పోరాటంలో ఆయనకు సహకారానికి గుర్తుగా అత్యున్నత పురస్కారం బంగ్లా లిబరేషన్ వార్ ఆనర్‌తో గౌరవించాం.. ఈ రోజు బంగ్లా ప్రజలకు ఎంతో విషాదకరమైన రోజు’ అని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం, బంగ్లాదేశ్ ప్రజల తరఫున ఆయన కుటుంబానికి, భారత ప్రభుత్వానికి, ప్రజలకు మా హృదయపూర్వక సానుభూతి, సంతాపాన్ని తెలుపుతున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని షేక్ హసీనా పేర్కొన్నారు.

ఇక బంగ్లా స్వాతంత్ర పోరాటం ఆరంభంలో దానికి వాజ్‌పేయి మద్దతు తెలిపారు. భారతీయ జన సంఘ్ అధ్యక్షుడిగా, లోక్‌సభ సభ్యుడిగా బంగ్లా ప్రజల హక్కుల కోసం తన నివాసంతోపాటు, అంతర్జాతీయ వేదికలపై కూడా వాజ్‌పేయి సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు బంగ్లాదేశ్ ఏర్పాటు తర్వాత 1971 డిసెంబరు 6 న పార్లమెంటులో ప్రసంగించిన వాజ్‌పేయి భారత్, బంగ్లా స్నేహాం బలమైన బంధమని, ఎలాంటి ఒత్తిడి దీనిని విడదీయలేదని, దౌత్యపరంగా ఎప్పటికీ విభేదాలు చోటుచేసుకోవని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.