యాప్నగరం

మేం శ్రీరాముడి వారసులం.. జైపూర్ రాజ కుటుంబీకురాలి ప్రకటన

BJP MP Diya Kumari | తమ జైపూర్ రాజకుటుంబీకులు శ్రీరాముడు, కుశుడి వారసులని బీజేపీ ఎంపీ దియా కుమారి ప్రకటించారు. తమ దగ్గర ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

Samayam Telugu 12 Aug 2019, 1:40 pm
తాము శ్రీరాముడి కుమారుడు కుశుడి వారసులమని బీజేపీ ఎంపీ, జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి ప్రకటించారు. అయోధ్య రామ జన్మభూమి కేసు సందర్భంగా ఇప్పటికీ రాముడి కుటుంబీకులు లేదా వారసులు ఎవరైనా ఉన్నారా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందనగా దియా కుమారి తాము కుశుడి వారసులమని తెలిపారు. తనలాగే రాముడి వారసులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారని ఆమె తెలిపారు. రాముడి వారసులం కావడం తమకెంతో గర్వకారణమని ఆమె చెప్పారు.
Samayam Telugu dia-kumari


తాము కుశుడి వారసులం అని చెప్పడానికి తమ కుటుంబం వద్ద ప్రాచీన పత్రాలు ఉన్నాయని ఆమె తెలిపారు. అవసరమైతే ఆ ఆధారాలను అందజేస్తానన్నారు. మా గ్రంథాలయం, మ్యూజియంలలో ప్రాచీన పత్రాలు, మనుస్మృతి, వంశవృక్షం ఉన్నాయి. వీటి ఆధారంగా తాము కుశుడి వారసులమని నిరూపించగలమని దియా కుమారి తెలిపారు. తాము లవుడి వారసులమని రాథోడ్లు ప్రకటించుకున్నారని దియా చెప్పారు.

కోర్టు వాదనల్లో తలదూర్చే ఉద్దేశం తనకు లేదన్న దియా.. అవసరమైతే డాక్యుమెంట్లను అందజేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జైపూర్ రాజవంశానికి చెందిన దియా కుటుంబీకుల దగ్గరున్న వంశ వృక్షంలో దశరథుడు 62వ స్థానంలో ఉండగా.. రాముడు 63, కుశుడు 64వ స్థానాల్లో ఉన్నారు. ఈ వంశ వృక్షంలో జైపూర్ రాజకుటుంబానికి చెందిన సవాయ్ జై సింగ్, మధో సింగ్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.