యాప్నగరం

తమిళనాడు గవర్నర్‌గా బన్వరిలాల్ పురోహిత్

తమిళనాడు నూతన గవర్నర్‌గా బన్వరిలాల్ పురోహిత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.

TNN 30 Sep 2017, 11:18 am
తమిళనాడు నూతన గవర్నర్‌గా బన్వరిలాల్ పురోహిత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడుకు ఇంచార్జి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, రాష్ట్రపతి మొత్తం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బ్రిగాడియర్ బి.డి.మిశ్రా (రిటైర్డ్), బిహార్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్, అస్సాం గవర్నర్‌గా జగదీష్ ముఖి, మేఘాలయా గవర్నర్‌గా గంగా ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu banwarilal purohit is new governor of tamil nadu
తమిళనాడు గవర్నర్‌గా బన్వరిలాల్ పురోహిత్


కాగా, తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన బన్వరిలాల్ పురోహిత్ ఇప్పటి వరకు అస్సాం గవర్నర్‌గా పనిచేశారు. అలాగే మేఘాలయాకు ఇంచార్జి గవర్నర్‌గా సేవలందించారు. మహారాష్ట్రలోని విదర్భకు చెందిన పురోహిత్.. సామాజిక, రాజకీయ వేత్తగానే కాకుండా విద్యా, పారిశ్రామికవేత్తగాను గుర్తింపు తెచ్చుకున్నారు. 1977లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పురోహిత్.. మూడు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు కాంగ్రెస్ తరఫున ఎన్నికవగా.. ఒకసారి బీజేపీ తరఫున పోటీచేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. అంతేకాకుండా, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే నాగ్‌పూర్ నుంచి స్థాపించిన ‘ది హితవాద’ పత్రికను బన్వరిలాల్ పురోహిత్ విజయవంతంగా నడిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.