యాప్నగరం

బీజేపీ మహిళా కార్యకర్త దారుణ హత్య.. బెంగాల్‌లో మరోసారి కలకలం

బీజేపీకి చెందిన మహిళా కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురవడం పశ్చిమ బెంగాల్‌లో మరోసారి కలకలం రేపుతోంది. టీఎంసీ వర్గీయులే ఆమెను హత్య చేశారని బెంగాల్‌ బీజేపీ ఆరోపిస్తోంది.

Samayam Telugu 14 Jun 2019, 1:40 pm
బీజేపీ కార్యకర్తల వరస హత్యలు బెంగాల్‌లో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లా ఆమ్లాని గ్రామానికి చెందిన సరస్వతీ దాస్ (42)ను గురువారం (జూన్ 13) సాయంత్రం ఆమె ఇంట్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. తలపై కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
Samayam Telugu saraswati


రక్తపు మడుగులో పడిఉన్న సరస్వతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్తం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె తలలో నుంచి డాక్టర్లు బుల్లెట్‌ను వెలికితీశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వర్గీయులే తమ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని బెంగాల్ బీజేపీ ఆరోపిస్తోంది. అది రాజకీయ హత్యా? వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నికలు, తదనంతర పరిణామాలతో బెంగాల్‌లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంసీ, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు కార్యకర్తలు హత్యకు గురయ్యారు.

ఇటీవల ఇదే జిల్లాలో ఆశిష్‌ సింగ్‌ అనే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. మాల్దాలోని ఓ ప్రాంతంలో బుధవారం శవమై కనిపించాడు. అతడి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే బెంగాల్ రణరంగంగా మారింది.

రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ అరాచక పాలన సాగిస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ హత్యలకు వ్యతిరేకంగా సోమవారం ‘బ్లాక్ డే’ నిర్వహించిన బీజేపీ.. బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది. బెంగాల్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం 18 మంది బీజేపీ ఎంపీలు పాల్గొన్న ఈ ఆందోళన కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

కోల్‌కతాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించడానికి యత్నించిన బీజేపీ శ్రేణులను బెంగాల్ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించి బీజేపీ కార్యకర్తలను నిలువరించారు. లాఠీఛార్జ్ చేశారు. దీనికి ప్రతిగా వారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. నీళ్ల బాటిళ్లు విసిరారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి మమత సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.