యాప్నగరం

Bengaluru Water Crisis: బెంగళూరే మాత్రమే కాదు.. హైదరాబాద్ సహా దేశంలోని 30 నగరాలకు నీటి సంక్షోభం

Bengaluru Water Crisis: వేసవి కాలం రాకముందు నుంచే బెంగళూరు నగరంలో నీటి సంక్షోభం తలెత్తింది. గత 2 నెలలుగా బెంగళూరు వాసులు నీళ్లు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఈ నీటి సమస్య కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితం కాదని.. దేశంలోని 30 నగరాలకు ఈ నీటి కొరత పొంచి ఉందని తెలుస్తోంది. అందులో హైదరాబాద్ కూడా ఉందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి.

Authored byశివరామచారి తాటికొండ | Samayam Telugu 3 Apr 2024, 3:07 pm
Bengaluru Water Crisis: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం.. నీటి సమస్యతో అల్లాడిపోతుండటం.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నీరు లేక బెంగళూరు నగరం పడుతున్న అవస్థలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన బెంగళూరు నగరంలో.. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నీటి సమస్య తలెత్తడంతో.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తూ సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరును విడిచివెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ నీటి సంక్షోభం బెంగళూరు నగరంలోనే కాకుండా హైదరాబాద్ సహా దేశంలో ఉన్న మరో 30 నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Samayam Telugu Bengaluru Water Crisis


బెంగళూరు నగరానికి ప్రధాన నీటి వనరులైన భూగర్భ జలాలు, కావేరీ నదిలో నీరు అడుగంటిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. దీంతో బెంగళూరు నగరంలో వేలాది బోర్లు ఎండిపోయాయి. దీంతో నీరు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీటిని పొదుపు చేయాలని అధికారులు, ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలు నగరవాసులకు సూచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాగు నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇలా నీటిని వృథా చేసిన 22 కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5000 చొప్పున రూ.1.1 లక్షల ఫైన్లను అధికారులు వసూలు చేశారు. అయితే రుతుపవనాలు వచ్చిన వర్షాలు పడేవరకు ఈ నీటి సమస్య కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక బెంగళూరులో ఏర్పడిన నీటి సమస్యను చూసి దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి తమకు కూడా వస్తే ఎలా అని జనం భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సమస్య బెంగళూరులో ఉండగా.. రాబోయే కాలంలో హైదరాబాద్‌తోపాటు దేశంలోని మరో 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2030 నాటికి భారత దేశ జనాభాలో 40 శాతం మందికి తాగునీరు దొరకదని 2019 లోనే నీతిఆయోగ్ ఒక నివేదికలో వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, బటిండా, లక్నో, చెన్నై సహా పలు నగరాలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది.

ఇక వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ 2020 నివేదిక ప్రకారం 2050 నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని పేర్కొంది. ఇందులో ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అమృత్‌సర్, పూణె, శ్రీనగర్, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, కోజికోడ్, వైజాగ్ ఉంటాయని వెల్లడించింది. ఇక 2023 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. భారతదేశంలోని సింధు-గంగా పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే భూగర్భ జలాల క్షీణతను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. వాయువ్య ప్రాంతంలో 2025 నాటికి చాలా తక్కువ భూగర్భ జలాల లభ్యత తగ్గుతుందని చెప్పింది.
రచయిత గురించి
శివరామచారి తాటికొండ
శివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.