యాప్నగరం

Bihar Floor Test: నితీశ్ బలపరీక్షకు ముందు.. బిహార్‌లో నాటకీయ పరిణామాలు.. స్పీకర్ రాజీనామా

Bihar Floor Test: బిహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం నేడు బలాన్ని నిరూపించుకోనుంది. దీనికి ముందు ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరిగాయి. బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వగా.. పదవి నుంచి తప్పుకోవడానికి సిన్హా ససేమీరా అంగీకరించలేదు. కానీ బుధవారం ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో బిహార్ సర్కారు బలనిరూపణ సజావుగా సాగే అవకాశం ఉంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 24 Aug 2022, 11:52 am

ప్రధానాంశాలు:

  • బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష
  • అంతకు ముందే స్పీకర్ రాజీనామా
  • అవిశ్వాస తీర్మానం పెట్టినా రాజీనామాకు నో చెప్పి, చివరకు..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bihar Speaker
Bihar Assembly Speaker VK Sinha
Bihar Floor Test: బీజేపీకి కటీఫ్ చెప్పి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు (ఆగస్టు 24న) అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు. ఆర్జేడీ మద్దతుతో జేడీయూ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి 165 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేస్తారని నితీశ్ కుమార్ ధీమాగా ఉన్నారు. కానీ బలపరీక్షకు ముందు బిహార్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నితీశ్ ప్రభుత్వానికి ఆర్జేడీ మద్దతు ఇస్తుండగా.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతల నివాసాలపై సీబీఐ బుధవారం దాడులు చేసింది. ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్ జిల్లాలోని 16 చోట్ల సీబీఐ దాడులు చేసింది.
నితీశ్ కుమార్ సర్కారు బలపరీక్షకు ముందే.. అసెంబ్లీ స్పీకర్‌ విజయ్ కుమార్ సిన్హాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తొలుత రాజీనామా చేసేది లేదని స్పష్టం చేసిన విజయ్ కుమార్ సిన్హా.. బుధవారం ఎట్టకేలకు స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం స్పష్టంగా లేదన్నారు. అవిశ్వాసం తీర్మానం కోసం 9 మంది సభ్యుల నుంచి తనకు అందిన లేఖల్లో 8 నిబంధనల ప్రకారం లేవన్నారు.

ప్రభుత్వం మధ్యంతరంగా మారినప్పుడు స్పీకర్ కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటారు. కానీ జేడీయూ ఆధ్వర్యంలో మహాఘట్‌బంధన్ ప్రభుత్వం బిహార్లో అధికారంలోకి వచ్చి రెండు వారాలైనా సిన్హా రాజీనామా చేయడానికి అంగీకరించలేదు. దీంతో బీజేపీ నుంచి వచ్చిన సిన్హాపై జేడీయూ, ఆర్జేడీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఆగస్టు 10న అసెంబ్లీ సెక్రటేరియట్‌కు తీర్మానాన్ని అందించగా.. ఆర్జేడీ, జేడీయూ, సీపీఐ (ఎంఎల్) పార్టీకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలు తీర్మానంపై సంతకం చేశారు.

సిన్హా స్పీకర్ పదవికి రాజీనామా చేయడంతో.. నితీశ్ ప్రభుత్వం బలనిరూపణ సజావుగా జరిగే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా.. అందులో సగం అంటే 122 సీట్లు వస్తే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకుంటుంది. కానీ మహాఘట్‌బంధన్ ప్రభుత్వానికి 165 మంది సభ్యుల బలం ఉంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.