యాప్నగరం

బిహార్ మంత్రి వినోద్ సింగ్ కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నా వెంటాడిన అనారోగ్యం

కరోనా వైరస్ మహమ్మారికి రాజు పేద అనే బేధం లేదు. వైరస్ బారినపడి ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బీహార్ మంత్రి వినోద్ సింగ్ బలయ్యారు.

Samayam Telugu 12 Oct 2020, 1:06 pm
బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే, మంత్రి వినోద్ సింగ్‌‌ జూన్‌ 28న కోవిడ్ బారినపడ్డారు. మంత్రితోపాటు ఆయన భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో కతియార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందజేశారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నా ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స కోసం పట్నా నుంచి ఆగస్టు 16న ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు.
Samayam Telugu బీహార్ మంత్రి కన్నుమూత


గత రెండు నెలలుగా ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నా పరిస్థితి మెరుగుపడలేదు. సోమవారం ఉదయం ఆయన మెదడులో రక్తస్రావం కావడంతో చనిపోయారు. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ సింగ్ భార్య నిషా సింగ్‌కు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. ప్రన్‌పూర్ స్థానం నుంచి ఆమె పోటీచేస్తున్నారు. నితీశ్ కుమార్ క్యాబినెట్‌లో వెనుబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు మెదడులో రెండుచోట్ల రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించారు.

విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన వినోద్.. ఏబీవీపీ నేతగా ఉన్నారు. తర్వాత కతియార్ జిల్లా బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వినోద్ సింగ్.. బీజేపీలో అత్యంత వేగంగా ఎదిగిన వెనుకబడిన వర్గాల నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తొలిసారి 2000 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 2010, 2015లో వరుసగా గెలుపొందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.