యాప్నగరం

జనగణమన పాడటంరాని వ్యక్తికి విద్యా శాఖా.. బిహార్‌ ప్రభుత్వంపై పేలుతున్న సెటైర్లు!

Nitish Kumar Cabinet: బిహార్‌లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురుస్తోంది. కనీసం జనగణమన కూడా పాడటం రాని వ్యక్తికి విద్యా శాఖ కేటాయించారని ఆర్జేడీ సెటైర్లు కురిపించింది.

Samayam Telugu 19 Nov 2020, 7:02 pm
బిహార్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. నితీశ్ కుమార్‌ను ఇప్పటికే బీజేపీ నామినేటెడ్ సీఎంగా ట్రోల్ చేసిన రాష్ట్రీయ జనతా దళ్ (RJD) తాజాగా మరో అంశానికి తెరపైకి తీసుకొచ్చింది. నితీశ్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్‌ చౌధరీకి విద్యా శాఖ బాధ్యతలు అప్పగించడంపై సెటైర్లు కురిపించింది.
Samayam Telugu బిహార్ విద్యాశాఖ మంత్రి
Bihar Education Minister Mewalal (Photo: Twitter)


కనీసం జాతీయ గీతం కూడా పాడటం రాని మేవాలాల్‌కు విద్యాశాఖ కేటాయించడం ఏంటని ఆర్జేడీ ప్రశ్నించింది. గతంలో జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా మేవాలాల్ ‘జనగణమన..’ పాడటంలో ఇబ్బంది పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను ట్వీటర్ వేదికగా షేర్ చేసింది. బిహార్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై సెటైర్లు వేసింది.


ఓ జాతీయపతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మేవాలాల్‌.. జాతీయ గీతాన్ని పూర్తిగా పాడలేకపోయారు. మధ్యలో కొన్ని లైన్లు పాడకుండానే జయహే అంటూ ముగించారు. ‘పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా’ అనడానికి బదులుగా ‘పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా’ అని పాడటంతో ప్రతిపక్షాలకు చెందిన నేతలతో పాటు నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఆర్జేడీ.. అవినీతి కేసుల మంత్రికి జాతీయ గీతం కూడా ఆలపించడం రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘బిహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌధరీ.. అనేక అవినీతి కేసుల్లో నిందితుడు.. కనీసం జాతీయ గీతం కూడా తెలియని వ్యక్తి. నీతీశ్ కుమార్‌ జీ.. ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా?’ అని RJD ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: బరాక్ ఒబామాపై యూపీలో కేసు నమోదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.