యాప్నగరం

బాలికలపై అకృత్యాలు: భర్తపై ఆరోపణలతో బిహార్‌ మంత్రి రాజీనామా

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన బిహార్ ముజఫర్‌పూర్‌ వసతి గృహం బాలికలపై అకృత్యాల ఘటనలో మరో సంచలనం. ఈ కేసులో తన భర్త ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాంఘిక శాఖ మంత్రి మంజూ వర్మ రాజీనామా చేశారు.

Samayam Telugu 8 Aug 2018, 8:07 pm
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన బిహార్ ముజఫర్‌పూర్‌ వసతి గృహం బాలికలపై అకృత్యాల ఘటనలో మరో సంచలనం. ఈ కేసులో తన భర్త ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాంఘిక శాఖ మంత్రి మంజూ వర్మ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో బుధవారం (ఆగస్టు 8) సాయంత్రం భేటీ అనంతరం మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఆమె ప్రకటించారు.
Samayam Telugu manju


ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వసతి గృహం నిర్వాహకుడు బ్రజేష్‌ ఠాకూర్‌తో మంజూ వర్మ భర్త చంద్రేశ్వర్ వర్మకు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. బ్రజేష్‌ ఠాకూర్ ఫోన్ కాల్ డాటాను పరిశీలించిన సీబీఐ అధికారులు.. చంద్రేశ్వర్ వర్మ ఇటీవల అతడితో 17 సార్లు మాట్లాడినట్లు గుర్తించారు. అత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చాక కూడా మాట్లాడారా, లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఉదంతంలో వర్మ పాత్రపై బాధిత బాలికలు కీలక విషయాలు చెప్పారు.

మంబైకి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ చేపట్టిన సామాజిక ఆడిట్‌లో వెలుగులోకి వచ్చిన ముజఫర్‌పూర్ షెల్టర్‌ హోం అకృత్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికలను చిత్రహింసలకు గురిచేసి వారికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అత్యాచారం చేసిన ఉదంతం దేశాన్ని నివ్వెరపరిచింది. 30 మంది బాలికలపై ఈ కీచకపర్వం సాగింది. వారంతా 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారే.

పొట్ట ఉన్న ఓ వ్యక్తి తరచూ వచ్చేవాడు..
హోంలో ఆశ్రయం పొందుతున్న 42 మంది బాలికల్లో సగానికి పైగా బాలికలపై లైంగిక దాడులు జరిగినట్టు వైద్య నివేదికల్లో వెల్లడైంది. ఈ కేసులో పోలీసులు 10 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. షెల్టర్‌ హోంను బిహార్‌ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి సీజ్ చేసింది. బాలికలను ఇతర జిల్లాల్లోని వసతి గృహాలకు తరలించి ఆశ్రయం కల్పించారు.

మంజూ వర్మ భర్త చంద్రేశ్వర్


చంద్రేశ్వర్‌ తరచూ బాలికల వసతి గృహానికి వచ్చేవాడని, తనతో పాటు ఓ అధికారిని కూడా తీసుకు వచ్చేవాడని పోలీసులతో బాధిత బాలికలు చెప్పారు. తనతో పాటు వచ్చిన అధికారిని కింద కూర్చోబెట్టి అతడు మాత్రం వసతి గృహంలోకి వచ్చేవాడని వారు తెలిపారు. ‘పొట్ట ఉన్న ఓ వ్యక్తి తరచూ వసతి గృహానికి వచ్చేవాడు’ అని చెప్పారు. అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా ఓ బాలికను చంపి, మృతదేహాన్ని పాతిపెట్టడంతో ఈ అంశంపై పార్లమెంట్‌ కూడా అట్టుడికింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.