యాప్నగరం

Sabarimala: మహిళపై పెప్పర్ స్ప్రేతో దాడి, వెనక్కి తగ్గిన తృప్తి దేశాయ్

Kerala | శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లడం కోసం పోలీసుల రక్షణ కోరడానికి వచ్చిన బిందు అమ్మిని అనే మహిళపై ఓ వ్యక్తి పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Samayam Telugu 26 Nov 2019, 11:13 pm
శబరిమల అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టిన తొలి మహిళ బిందు అమ్మినిపై ఓ వ్యక్తి పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. గత సీజన్లో మహిళల హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ నాయకత్వంలో అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన బృందంలో బిందు ఒకరు. మంగళవారం ఎర్నాకుళంలోని సీటీ పోలీసు కమిషనర్ ఆఫీసు ఎదుట.. శ్రీనాథ్ పద్మనాభన్ అనే వ్యక్తి ఆమెపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. బిందును సమీపంలోని హాస్పిటల్‌లో చేర్పించారు. పద్మనాభన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu bindu ammini attacked with pepper spray in kochi trupti desai cancels sabarimala visit
Sabarimala: మహిళపై పెప్పర్ స్ప్రేతో దాడి, వెనక్కి తగ్గిన తృప్తి దేశాయ్


అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లాలని భావించిన బిందు.. తనకు రక్షణ కల్పించాల్సిందిగా ఎర్నాకుళం పోలీస్ కమిషనర్‌ను కోరింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనాథ్ పద్మనాభన్.. ఆఫీసు నుంచి బయటికి వచ్చిన బిందుపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. బిందుపై పద్మనాభన్ పెప్పర్ స్ప్రేతో దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2019 జనవరిలో కేరళ పోలీసుల భద్రత మధ్య కనక దుర్గ అనే మహిళతో కలిసి బిందు అమ్మిని అయ్యప్ప ఆలయంలోకి వెళ్లి పూజలు చేశారు. శబరిమల ఆలయంలోకి వెళ్లడానికి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళపై ఉన్న నిషేధాన్ని 2018, సెప్టెంబర్ 28న సుప్రీం ఎత్తివేసింది. ఈ తీర్పును అయ్యప్ప భక్తులు వ్యతిరేకించారు.

నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం అయ్యప్ప ఆలయంలోకి వెళ్లాలని తృప్తి దేశాయ్ భావించారు. కొచ్చి చేరుకున్న తర్వాత ఇతర మహిళా హక్కుల కార్యకర్తలతో కలిసి ఆమె శబరి వెళ్లేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే పోలీసుల భద్రత కోరడం కోసం కమిషనరేట్‌కు వెళ్లారు.

అయ్యప్ప ఆలయంలో పూజలు చేసిన తర్వాతే కేరళను వదిలి వెళ్తానని తృప్తి దేశాయ్ ప్రకటించారు. కానీ పోలీసులు దేశాయ్ బృందం వెనక్కి పంపిస్తామన్నారు. తృప్తి దేశాయ్ కేరళ పర్యటనలో కుట్ర కోణం ఉందని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఆరోపించారు. పెప్పర్ స్ప్రే దాడి ఘటన తర్వాత.. అయ్యప్ప ఆలయంలోకి వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు తృప్తి తెలిపారు.

పోలీసుల భద్రత, ప్రభుత్వ సపోర్టుతో మహిళలెవర్నీ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లరని న్యాయ శాఖా మంత్రి ఏకే బాలన్ స్పష్టం చేశారు. శబరిమల వెళ్లడానికి మహిళలకు పర్మిషన్ ఇవ్వొద్దని కమిషనరేట్ ఆఫీసు ముందు హిందూత్వవాదులు నినాదాలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.