యాప్నగరం

Karnataka CM యడ్డీకి షాక్.. కుర్చి దిగిపోవాలని అధిష్ఠానం ఆదేశం!

యడియూరప్పను పదవి నుంచి తొలగించాలని అధిష్ఠానంపై తెచ్చిన ఒత్తిడి ఫలించినట్టే కనిపిస్తోంది. అసమ్మతి నేతలు కొంతకాలంగా యడ్డీని దిగిపోవాలని కోరుతున్నారు.

Samayam Telugu 11 Jun 2021, 12:12 pm
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయనను పీఠం నుంచి దింపాల్సిందేనని బీజేపీలో పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యడియూరప్పను పదవి నుంచి తప్పుకోవాలని అధిష్ఠానం ఆదేశించినట్టు ఢిల్లీలోని బీజేపీ అత్యున్నత వర్గాలు ధ్రువీకరించాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై పది రోజుల నుంచి డిమాండ్ మరింత ఊపందుకుంది. యడ్డీ రాజీనామా చేయాలని పట్టుబడుతున్న సీనియర్ నేతలను బుజ్జగించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌సింగ్‌ జూన్ 17, 18 తేదీల్లో కర్ణాటకలో పర్యటించనున్నారు.
Samayam Telugu బీఎస్ యడియూరప్ప
BS Yediyurappa


అయితే, ఈ విషయంపై ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన అరుణ్‌సింగ్‌.. కర్ణాటకలో సీఎం మార్పును కొట్టిపారేశారు. యడియూరప్ప పనితీరు బేషుగ్గా ఉందని, కొవిడ్‌-19ను సమర్ధంగా నియంత్రిస్తున్నారని ప్రశంసించారు. యడియూరప్ప పనితీరుపై అధిష్ఠానం సంతృప్తి ఉందని, సీఎం మార్పు లేదని స్పష్టం చేశారు. ఆయనే పూర్తికాలం సీఎంగా ఉంటారని వివరించారు. జూన్ 17 న తాను బెంగళూరు వెళ్లి అసమ్మతి ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. నాయకత్వ మార్పుపై ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు.

మార్పు ఉండబోదని అరుణ్‌సింగ్‌ చెబుతున్నప్పటికీ, వచ్చేవారం తాను బెంగళూరు వెళ్లి అసంతృప్తులను బుజ్జగిస్తానని చెప్పడంతో యడ్డీకి పదవీ గండం తథ్యమనే సంకేతాలకు బలం చేకూరినట్టయ్యింది. కాగా, నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం యడ్డీ గతవారం తోసిపుచ్చారు. పూర్తికాలం తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని, తనపై అధిష్ఠానానికి నమ్మకం ఉందన్నారు.

ఈ విషయంలో ఎటువంటి గందరగోళానికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీ పెద్దలకు నాపై నమ్మకం ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతాను.. నమ్మకం కోల్పోయిన రోజున పదవి నుంచి తప్పుకుంటా.. రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్లు పనిచేస్తున్నాను’’ అని యడియూరప్ప అన్నారు.

‘‘ఈ విషయంలో నాకు ఎటువంటి గందరగోళం లేదు.. అధిష్ఠానం నాకు అవకాశం ఇచ్చింది.. దీనిని నా శాయశక్తులా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. మిగతా అంశాలను హైకమాండ్‌కే వదిలేశా’’అని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు యడియూరప్ప ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.