యాప్నగరం

Karnataka: "నాన్‌ వెజ్" పంచాయితీ.. మాంసం తిని గుడికి వెళ్లడంపై రచ్చ

కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్యపై పలు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఆయన మాంసం తిని ఆలయానికి వెళ్లారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని అంటున్నారు. అయితే దీనిపై సిద్ధరామయ్య కూడా అంతే ధీటుగా స్పందించారు. తాను మాంసాహారం తింటానని, తనను ఎవరూ అడ్డుకోలేరని అంటున్నారు. అయితే మాంసం తిని ఆలయానికి వెళ్తానడం మొండితనమని కొందరు ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో దీనిపై హాట్ హాట్‌గా చర్చ సాగుతుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 23 Aug 2022, 12:46 pm

ప్రధానాంశాలు:

  • సిద్ధరామయ్యపై మండిపడుతున్న బీజేపీ నేతలు
  • మాంసాహారం తిని ఆలయానికి వెళ్లారని ఆరోపణలు
  • మాంసాహారం తింటాను.. నన్నెవరూ ఆపలేరన్న సిద్ధరామయ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Siddaramaiah
కర్ణాటకలో (Karnataka) నాన్ వెజ్ పంచాయితీ మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య మాంసాహారం తిని గుడికి వెళ్లారని బీజేపీ ఆరోపించింది. మడికేరిలో మాంసాహారం తిని సిద్ధరామయ్య కొడ్లిపేటలోని పవిత్ర బసవేశ్వర ఆలయాన్ని సందర్శించారని ఎమ్మెల్యే బోపయ్య ఆరోపించారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆయన విమర్శించారు.
ఇదే విషయంపై సిద్ధరామయ్యను ప్రశ్నించగా.. ఆయన ఎదురుదాడికి దిగారు. ఇది అడగడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. "ఇది అడగడానికి మీరు ఎవరు..? నేను మాంసం తినగలను. నన్ను ఎవరూ ఆపలేరు. మీరు మాంసాహారులైతే మీరు మాంసం తినవచ్చు. రాత్రి మాంసాహారం తిన్న తర్వాత మరుసటి రోజున గుడికి వెళ్లడం మంచిదేనా..? ఇది బీజేపీ నాయకుల ఆరోపణ మాత్రమే. " అని ఆయన అన్నారు.

దీంతో సిద్ధరామయ్యపై విమర్శలు వర్షం కురుస్తోంది. సిద్ధరామయ్య భార్య చాముండేశ్వరి అమ్మవారికి భక్తురాలు, ఆమె కూడా మాంసం తిని ఆలయానికి వెళ్తారా..? అని మైసూరు కొడగు ఎంపీ ప్రతాపసింహ ప్రశ్నించారు. పంది మాంసం తిని మీ స్నేహితుడు, ఎమ్మెల్యే అయిన జమీర్ అహ్మద్‌ ఇంటికి వెళ్తారా..? అని నిలదీశారు. అలాగే మైసూరు నగర మాజీ మేయర్ రవికుమార్ కూడా సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు. 2017లో దసరా వేడుకల్లో కూడా సిద్దరామయ్య మాంసాహార భోజనం చేసి చాముండేశ్వరి అమ్మవారి పూజల్లో పాల్గొన్నారని, ఇది నిజమని అన్నారు.

అలాగే సమాజంలో ఎవరైనా ఏదైనా తినే స్వేచ్ఛ ఉందని, అయితే మాంసం తిని దేవాలయానికి వెళ్తామని చెప్పడం మొండితనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర సీఎల్పీ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక సంస్కృతి సంప్రదాయముంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలా బహిరంగంగా మాట్లాడడం సరికాదన్నారు. మాంసం తిని.. ఆలయానికి వెళ్తామనడం తానే కాదు.. ఎవరూ ఆమోదించరని అన్నారు.

కాగా కొడగులోని బీజేపీ కంచుకోటపైకి సిద్ధరామయ్య కొడగు చలో పాదయాత్రను ప్లాన్ చేశారు. ఆగస్టు 26న జరగనున్న కొడగు చలో మార్చ్‌కు ఆహ్వానిస్తూ పార్టీ శాసన సభ్యులు, కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అక్కడి ప్రజలు సిద్ధరామయ్యను క్షమించరని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.