యాప్నగరం

యూపీ: పోలీసుల సమక్షంలో హత్య.. కాల్పులకు తెగబడిన బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు

ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అనుచరుడు పోలీసులు, అధికారుల సమక్షంలోనే హత్యకు పాల్పడిన ఘటన బల్లియా జిల్లాలో గురువారం జరిగింది.

Samayam Telugu 16 Oct 2020, 9:40 am
అధికారులు, పోలీసుల ముందే ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. రేషన్ దుకాణాల కేటాయింపుల సందర్భంగా సభ్యుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. జయప్రకాశ్ (46) అనే వ్యక్తిపై బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ధీరేంద్ర సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. వేదికపై అధికారులు ఉండగానే ఈ ఘటన జరగడం గమనార్హం. కాల్పుల తర్వాత అక్కడ జనం భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీగా జనం గుమిగూడి ఉండగా.. నిందితుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు వీడియోలో స్పష్టమవుతోంది.
Samayam Telugu యూపీలో కాల్పులు
Picture used for representational purpose only


బల్లియాలోని దుర్జాపూర్ గ్రామంలో రేషన్ దుకాణాల కేటాయింపుల కోసం అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాజరైన జయప్రకాశ్, ధీరేంద్ర సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ధీరేంద్ర తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని ఎస్పీ దేవేంద్ర నాథ్ తెలిపారు. హత్య జరిగే సమయానికి అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

నిందితుడు బల్లియా బీజేపీ ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ధ్రువీకకరించారు. గొడవలు, వివాదాలు ఎక్కడైనా జరుగుతాయి.. ఇరు వర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి.. కానీ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం నేరమని వ్యాఖ్యానించారు. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు 15 నుంచి 20 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే, ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

అధికారుల సమక్షంలో ఈ ఘటన జరగడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనను సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఆర్డీఓ సహా అక్కడ ఉన్న పోలీస్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు హోంశా అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ కుమార్ అవస్థీ తెలిపారు. అధికారుల పాత్రపై దర్యాప్తు జరిపించి, నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.