తనను శివసేన కార్యకర్తలు హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య ఆరోపించారు. వారి బారి నుండి తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున తగు చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ముంబై పోలీస్ కమిషనరుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. చాలా కాలంగా ముంబై నగర పాలక సంస్థ (ఎంసీజీఎం)లోని అవినీతిపై కిరీట్ సోమయ్య ఎలుగెత్తుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా అందులోని అవినీతిపై ధ్వజమెత్తి మాట్లాడుతూ దాని పాలక పక్షమైన శివసేనకు ఇబ్బందికరంగా పరిణమించారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన దసరా వేడుకల ముగింపు సందర్భంగా కిరీస్ సోమయ్యకు, శివసేన కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఎంసిజీఎంలో అవినీతికి గుర్తుగా ఆయన దసరా వేడుకల సందర్భంగా అవినీతి దిష్టిబొమ్మను దహనం చేయగా దానికి శివసేన కార్యకర్తలు తీవ్రనిరసన వ్యక్తం చేసారు. అప్పటి నుండి వివాదం ముదిరింది. ఈ పరిస్థితుల్లో శివసేన నుండి తనకు బెదిరింపులు వస్తున్నాయని కిరీట్ సోమయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా కిరీట్ సోమయ్య ఫిర్యాదు తరువాత ముంబై పోలీసులు 13మందిని అరెస్ట్ చేశారు.
ఆ బీజేపీ ఎంపీకి ప్రాణభయం..
తనను శివసేన కార్యకర్తలు హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య ఆరోపించారు.
TNN 14 Oct 2016, 2:17 am