యాప్నగరం

కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.4 వేల కోట్లా?

కర్ణాటక శాసససభ ఎన్నికల్లో 104 స్థానాలతో మెజార్టీ సీట్లు దక్కించుకున్న బీజేపీ,సాధారణ మెజార్టీకి మాత్రం అవసరమైన సీట్లను గెలుచుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ జట్టుకట్టాయి.

Samayam Telugu 22 May 2018, 8:48 am
కర్ణాటక శాసససభ ఎన్నికల్లో బీజేపీ రూ.6,500 కోట్లు ఖర్చుచేసిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి ఆనందశర్మ విమర్శలు గుప్పించారు. బీజేపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు పంచిపెట్టిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు బలపరీక్షలో నెగ్గడానికి కాంగ్రెస్- జేడీఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు మరో రూ.4 వేల కోట్లు సైతం కేటాయించిందని ఆనంద్ శర్మ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు వేల కోట్లు ఖర్చుచేసిన బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలు జాతికి క్షమాపణ చెప్పాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకున్నంత పెద్ద కార్యాలయం మరేపార్టీకి లేదని ధ్వజమెత్తారు.
Samayam Telugu కర్ణాటక ఎన్నికలు


అంతేకాదు అన్నిపార్టీల కంటే రెట్టింపు ఆదాయం బీజేపికి ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పాలని ఆయన నిలదీశారు. నల్లధనంతో ఎన్నికల్లో తలపడిన కమలం పార్టీ నల్లధన వ్యతిరేక పోరాటం చేస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడిన అమిత్‌షా కర్ణాటకలో చేసిన తప్పులకు దేశ ప్రజలకు క్షమాపణ చెబుతారని భావించామని, అందుకు విరుద్ధంగా కాంగ్రెస్- జేడీఎస్ పొత్తును అపవిత్ర కలయికతో పోల్చడం సరికాదన్నారు. బీహార్‌‌లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కూటమికి ప్రజలు ఓటేస్తే ఎన్నికల అనంతరం జేడీయూతో కలిసి బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం పవిత్రమైన కలయికా? అని ప్రశ్నించారు.

అతిపెద్దపార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని నీతులు చెబుతోన్న అమిత్‌షా గోవా, మణిపూర్‌, మేఘాలయలో అదే సూత్రం ఎందుకు వర్తింపజేయలేదని ఆనంద్‌శర్మ ఎద్దేవా చేశారు. డబ్బు, అధికారం దుర్వినియోగానికి పాల్పడి ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకుని బలపరీక్షలో నెగ్గడానికి ప్రయత్నించారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏం ఒరిగిందని, ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.