యాప్నగరం

ఆప్‌కి షాక్: 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలను ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించింది.

TNN 19 Jan 2018, 3:28 pm
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలను ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఈసీ నివేదించింది. ఎమ్మెల్యేలుగా ఉంటూ లాభదాయకమైన పార్లమెంటరీ సెక్రటరీ పదవులు చేపట్టినందుకే వారిపై అనర్హత వేటు వేసినట్లు రాష్ట్రపతికి పంపిన సిఫార్సులో ఈసీ పేర్కొంది.
Samayam Telugu blow for aap ec disqualifies 20 mlas for holding office of profit
ఆప్‌కి షాక్: 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు


2015 మార్చి 13 నుంచి 2016 సెప్టెంబర్ 8 వరకు ఈ 20 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ సెక్రటరీలుగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి మ‌రో లాభ‌దాయ‌క ప‌ద‌విలో ఉంటే అది రాజ్యాంగ ఉల్లంఘ‌నే అవుతుంది. దీన్ని కారణంగా చూపుతూ ఈసీ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. రాష్ట్రపతి ఆమోదం కోసం తన సిఫారుసును పంపింది. ఒకవేళ వీరి అనర్హతవేటును రాష్ట్రపతి ఆమోదిస్తే ఢిల్లీలో ఉపఎన్నికలు వస్తాయి.

కాగా, ఈ వివాదం ఇప్పటిది కాదు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన కొన్నాళ్లకే ఈ వివాదం మొదలైంది. తమ ప్రభుత్వంలోని 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించి వారిని విభిన్న మంత్రిత్వశాఖలకు అనుసంధానిస్తూ ఆప్ సర్కారు 2015 ఏప్రిల్ 13న ఉత్తర్వు జారీ చేసింది. వీళ్లు ఎలాంటి వేతన, భత్యాలు లేకుండా పనిచేస్తారని, వారి వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడబోదని, వారి నియామకం వల్ల ప్రభుత్వ పనితీరు మెరుగవుతుందని ఆప్ సర్కారు తెలిపింది.

అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రశాంత్ పాటిల్ అనే న్యాయవాది ఈసీకి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సెక్రటరీలుగా ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు తమపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థనలను ఈసీ 2017 జూన్‌లో కొట్టివేసింది. దీంతో వారు 2017 ఆగస్టులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి ఈసీ దీనిపై విచారణ చేపట్టకపోవడంతో తాము పిటిషన్‌ను స్వీకరించలేమని ఆప్ ఎమ్మెల్యేలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, 20 ఆప్ ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జోతిని కాంగ్రెస్ కోరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.