యాప్నగరం

120 అడుగుల బెయిలీ వంతెన.. కేవలం 60 గంటల్లోనే నిర్మాణం: సైన్యం మరో ఘనత

జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయరహదారిపై ఉన్న వంతెన దెబ్బతింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Samayam Telugu 17 Jan 2021, 7:18 am
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) అరుదైన రికార్డును సాధించింది. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాంబన్ సమీపంలోని కేలా మోర్ వద్ద 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను కేవలం 60 గంటల్లో పూర్తి చేసింది. ఈ రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడంతో జనవరి 10 నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో కశ్మీర్‌ లోయకు దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో బెయిలీ వంతెనను బీఆర్ఓ నిర్మించింది. ఇందుకోసం చిన్నపాటి ప్రి-ఫ్యాబ్రికేటెడ్‌ ఉక్కు ఫలకాలను ఉపయోగించారు.
Samayam Telugu బెయిలీ వంతెన


శనివారం నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతమైనట్టు బీఆర్వో తెలిపింది. సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలను అనుమతించామని బీఆర్వో చీఫ్ ఇంజినీర్ బ్రిగేడియర్ ఐకే జగ్గీ అన్నారు. కొండచరియలు విరిగిపడటంతో వారం రోజుల కిందట కేలా మోర్ వద్ద వంతెన దెబ్బతింది. వంతెనను మూసివేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజుల్లోనే వంతెనను సిద్ధం చేస్తామని తొలుత బీఆర్వో ప్రకటించింది.

యుద్ధ ప్రాతిపదికన బెయిలీ వంతెన నిర్మించి, శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రయిల్ రన్ నిర్వహించారు. సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఈ వంతెన ప్రారంభంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు ఊరట లభించింది.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) అభ్యర్థనతో బీఆర్వో ఈ వంతెనను నిర్మించింది. ‘జనవరి 14 ఉదయం 7.30 గంటలకు నిర్మాణ పనులు ప్రారంభించారు. లెఫ్టినెంట్ కల్నల్ వరుణ్ ఖేరే నేతృత్వంలోని 99 రోడ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ బృందం ఈ నిర్మాణంలో పాలుపంచుకుంది. ఆరుగురు అధికారులు, 10 మంది సూపర్‌వైజర్లు, 50 మంది వర్కర్లు 60 గంటలపాటు శ్రమించి వంతెనను పూర్తిచేశారు’ అని బీఆర్వో తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.