యాప్నగరం

అక్కడ సీట్ల సర్దుబాటు జరిగేనా?

రానున్న లోక్‌సభ ఎన్నికలకు పోటీ విషయంలో యూపీలో అప్పుడే పార్టీల మధ్యన సంప్రదింపులు మొదలయ్యాయి

Samayam Telugu 4 Jun 2018, 4:01 pm
రానున్న లోక్‌సభ ఎన్నికలకు పోటీ విషయంలో యూపీలో అప్పుడే పార్టీల మధ్యన సంప్రదింపులు మొదలయ్యాయి. ఇటీవలే ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన ఈ రాష్ట్రంలో మొన్నటి వరకూ వైరి వర్గంగా ఉన్న పార్టీలు కలిసి పోటీ చేయడానికి సై అని అంటున్నాయి. దశాబ్దాలుగా ఉప్పూనిప్పులుగా మెలిగిన పార్టీలు ఇప్పుడు మిత్రపక్షాలుగా మారే దాఖలాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనాలంటే ఉమ్మడిగా పోటీ చేయకతప్పదనే నిర్ణయానికి వచ్చాయి ఈ పార్టీలు. అయితే సీట్ల వ్యవహారమే వీటిని ఒక తాటి మీదకు తెస్తుందా? అనే అనుమానాన్ని కలిగిస్తోంది.
Samayam Telugu Sonia-Gandhi-Mayawati


తమకు 40 సీట్లు కావాలని అంటున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. అసలుకు యూపీలో ఉన్నదే 80 ఎంపీ సీట్లు. వాటిల్లో 40 సీట్లు తనకే కావాలని మాయ అనడం ఆసక్తిదాయకంగా మారింది.

ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పరచాలనుకుంటున్న కూటమిలో బీఎస్పీతో పాటు సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్డీలు కూడా ఉన్నాయి. ఈ నాలుగు పార్టీలూ కలిసి కూటమిగా పోటీ చేయాలనే మాట వీరి నుంచినే వినిపిస్తోంది. మొన్నటి వరకూ యూపీలో ఎస్పీ అధికారంలో ఉండింది. మాయవతి ఏకంగా 40 సీట్లు కావాలని అంటున్న నేపథ్యంలో... ఈ ప్రతిపాదనకు ఎస్పీ ఒప్పుకుంటుందా? అంటే కచ్చితంగా ఒప్పుకోదనే చెప్పాలి.

కూటమిలో మెజారిటీ సీట్లు తమకే కావాలని ఎస్పీ కోరే అవకాశం ఉంది. రెండో పెద్ద పార్టీగా బీఎస్పీ పోటీ చేసుకోవడానికి ఎస్పీ కాదనకపోవచ్చు. ఆర్ఎల్డీ కూడా తమకు పట్టున్న ప్రాంతంలో సీట్టను గట్టిగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీది మాత్రం మైనర్ వాటా అయ్యే అవకాశం ఉంది. ఐదారు సీట్లతో కాంగ్రెస్ సర్దుకోవాల్సి రావొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఈ సంగతులన్నీ ఎలా ఉన్నా.. తమకే 40 సీట్లు కావాలన్న మాయవతి డిమాండ్, ఈ కూటమి ఏర్పాటుకే ప్రతిబంధకంగా మారుతోందని విశ్లేషకులు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.