యాప్నగరం

కుప్పకూలిన భవనం.. ఏడుగురి మృతి, శిథిలాల కింద 40 మంది

ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డోంగ్రీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు దుర్మరణం పాలవగా.. శిథిలాల కింద మరో 40 మంది చిక్కుకున్నారు.

Samayam Telugu 16 Jul 2019, 7:22 pm
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నారు. శిథిలాల కింద మరో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. డోంగ్రి ప్రాంతంలోని తండేల్‌ వీధిలో మంగళవారం (జులై 16) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. భవనం కుప్పకూలిన విషయం గుర్తించగానే స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు.
Samayam Telugu mumbai


కుప్పకూలిన భవనం దాదాపు వందేళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. కూలిన భవనం చుట్టుపక్కల ఉన్న భవనాల్లో చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. ఘటనా స్థలికి సమీపంలోనే మసీదు ఉంది. ప్రమాద విషయం తెలియగానే పరుగెత్తుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. శిథిలాల కింద నుంచి ఓ చిన్నారిని తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి.

ముంబైలో కూలిన భవనం


ముంబైలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా పలు చోట్ల ఇళ్లు, ప్రహరీలు కూలి పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. వర్షాల నేపథ్యంలో పాతబడిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లు కుప్పకూలుతున్నాయి. తాజా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.