యాప్నగరం

ఈ ఏడాది వ్యాక్సిన్‌ కష్టమే.. ఐసీఎంఆర్ ప్రకటనకు భిన్నంగా స్పందించిన సీసీఎంబీ

ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచ మొత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకొస్తామని ఐసీఎంఆర్ ప్రకటించింది.

Samayam Telugu 5 Jul 2020, 7:53 am
కరోనా వైరస్‌కు దేశీయ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15లోపు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐసీఎంఆర్ చేసిన ప్రకటనపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్-సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా స్పందించారు. ఈ ఏడాది కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ రావడం కష్టమేనని వ్యాఖ్యానించిన ఆయన... బహుశా వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి రావొచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌పై భారీస్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ప్రక్రియ వివిధ దశల్లో జరుగుతుంది కాబట్టి ఆగస్టు 15 నాటికి అదెలా సాధ్యమని సందేహాలు వ్యక్తమవుతుండగా.. కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
Samayam Telugu కరోనా వైరస్ వ్యాక్సిన్
Coronavirus Vaccine


‘పుస్తకాల్లో ఉన్నట్టే అన్నీ కచ్చితత్వంతో జరిగితే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో వస్తుందని, మన చేతుల్లో వ్యాక్సిన్‌ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ సంఖ్యలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాల్సి ఉంటుంది. అనారోగ్యం ఉన్నవారికి మందుబిళ్ల ఇచ్చి తగ్గిందా లేదా అని చూసేందుకు ఇదేమీ డ్రగ్‌ కాదు’ అని మిశ్రా వ్యాఖ్యానించారు.

‘నిజానికి వ్యాక్సిన్ల అభివృద్ధికి చాలా ఏళ్లు పడుతుంది. కానీ మనమిప్పుడు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. వ్యాక్సిన్‌ మెరుగ్గా పనిచేస్తే వచ్చే ఏడాది తొలినాళ్లలో రావొచ్చు. అంతకన్నా ముందైతే రాదు. నేను అర్థం చేసుకున్నంత వరకు అంతకన్నా ముందైతే రావడం కష్టం’ అని రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుతం సీసీఎంబీలో రోజుకు 400-500 కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ఇంతకన్నా తక్కువ సమయంలో, తక్కువ మందితో, తక్కువ ధరలో, ఎక్కువ టెస్టులు చేసే విధానాన్ని ఐసీఎంఆర్‌కు తాము ప్రతిపాదించామని తెలిపారు. ఇది చాలా సులభమైన విధానమని, అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు, ఆగష్టు 15 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఐసీఎంఆర్ చేసిన ప్రకటనపై వైద్య, పరిశోధన నిపుణులు భిన్నంగా స్పందించిన నేపథ్యంలో ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయ నిబంధనల మేరకే వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్‌లో అనవసరమైన అంశాలను వదిలిపెట్టి.. అవసరమైన ప్రక్రియను చేపడుతున్నామని.. ట్రయల్స్‌లో పాల్గొంటున్న వారి ఎంపికను వేగవంతం చేస్తున్నామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.