యాప్నగరం

కాల్పుల విరమణకు స్వస్తి.. సైన్యాన్ని వెనక్కితగ్గొద్దన్న రాజ్‌నాథ్!

పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో కశ్మీర్‌‌లో కాల్పుల విరమణ కూడా కేంద్రం స్వస్తి చెప్పింది. సుమారు 35 రోజులపాటు సాగిన కాల్పుల విరమణపై కేంద్ర హోం శాఖ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది.

TNN 17 Jun 2018, 12:39 pm
Samayam Telugu కశ్మీర్‌లో కాల్పుల విరమణ
పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో కశ్మీర్‌‌లో కాల్పుల విరమణ కూడా కేంద్రం స్వస్తి చెప్పింది. సుమారు 35 రోజులపాటు సాగిన కాల్పుల విరమణపై కేంద్ర హోం శాఖ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. జమ్మూకశ్మీర్‌లో కాల్పుల విరమణ శనివారం అర్థరాత్రితో ముగిసినట్టు తెలిపింది. కాల్పుల విరమణ అనేది మత విశ్వాసానికి కొలమానంగా భావింపబడుతుంది తప్పా, తీవ్రవాదులు లేదా హురియత్ లాంటి వేర్పాటువాదుల అంశాలను పరిగణనలోకి తీసుకుని కాదని వెల్లడించింది. గతవారం శ్రీనగర్‌లో రైజింగ్ కశ్మీర్ పత్రిక సంపాదకుడు షుజాత్ బుఖారీ హత్య, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెంది జవాన్ ఔరంగజేబును అపహరించి అత్యంత పాశవికంగా హతమార్చడం లాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో కాల్పుల విరమణకు కేంద్రం స్వస్తి పలికింది. కాల్పుల విరమణపై జరిగిన సమీక్షలో ఈ రెండు అంశాలపైనే వాడిగావేడిగా చర్చించినట్టు తెలుస్తోంది.

హింసకు పాల్పడేవారు, తీవ్రవాదులపై అవసరమైన చర్యలను భద్రతా దళాలు తీసుకోవచ్చని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాద, హింసరహిత వాతావరణం నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ ప్రజల ఆసక్తులే తమకు ముఖ్యమని ప్రత్యేకంగా యువత ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చి తీవ్రవాదం వైపు మళ్లకుండా చూడటం, చెడు మార్గంలో పయనిస్తోన్న వారిని వెనక్కు రప్పించడమే తమ ధ్యేయమని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రంజాన్ మాసంలో కాల్పుల విరమణను సక్రమంగా పాటించిన సైన్యానికి రాజ్‌నాథ్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సైన్యం కాల్పులు విరమణ పాటిస్తున్నా తీవ్రవాదులు మాత్రం తమ హింసను విడిచిపెట్టకుండా దాడులకు పాల్పడి అమాయక పౌరులు, సైనికులను పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏదైనా ఓ నిర్ణయం విజయవంతం కావాలంటే అందరి సహకారం ఉండాలి కానీ, ఇక్కడ అలా జరగలేదని అన్నారు. భద్రతా దళాలు ఎంతో సంయమనం పాటించినా, ఉగ్రవాదులు మాత్రం తమ దాడులను కొనసాగించారని మండిపడ్డారు. తీవ్రవాదాన్ని అడ్డుకుని, తప్పుదారిపట్టిన యువతను వెనక్కు తీసుకురావడానికి శాంతిని కాంక్షించే అన్ని వర్గాలు ప్రజలు కలిసికట్టుగా ప్రయత్నించాలని ఆయన కోరారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా లోయంలో శాంతియుత వాతావారణ నెలకొల్పడానికి తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిలిపివేస్తున్నట్టు కేంద్రం తీసుకున్న నిర్ణయం శనివారం అర్థరాత్రితో ముగిసింది. దీంతో ఉగ్రవాదులపై పెద్ద ఎత్తున భద్రతా దళాలు దాడులు చేసే అవకాశం ఉంది. శనివారం నాడు అనంత్‌నాగ్ జిల్లాలో ఆందోళనకారులకు, సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజౌరీ సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.