యాప్నగరం

చిన్నారుల తల్లిదండ్రులకు అలర్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు

విద్యార్థుల తల్లిదండ్రులకు గమనిక. ఒకటో తరగతిలో చేరాలంటే ఇక నుంచి పిల్లలకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలి. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 22 Feb 2023, 10:31 pm

ప్రధానాంశాలు:

  • ఒకటో తరగతిలో చేరాలంటే ఆరేళ్లు ఉండాల్సిందే
  • రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ
  • నూతన విద్యావిధానం ప్రకారం ఈ నిబంధన తప్పనిసరి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kids
Kids (Representative Image)
విద్యార్థులు ఒకటో తరగతిలో చేరేందుకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. నూతన విద్యా విధానం ప్రకారం చిన్నారులకు మూడేళ్ల ప్రి స్కూల్ ఎడ్యుకేషన్‌తోపాటు ఒకటో తరగతి, రెండో తరగతి కలిపి ఫౌండేషనల్ స్టేజ్ ఐదేళ్లు ఉంటుంది. మూడు నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు ఈ ఐదేళ్లలో తమ వయసును బట్టి నేర్చుకుంటారు.
‘ప్రి స్కూల్ నుంచి రెండో తరగతి వరకు చిన్నారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా నేర్చుకోవడాన్ని నూతన విద్యావిధానం ప్రోత్సహిస్తుంది. అంగన్వాడీలు లేదా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్, ఎన్జీవోలు నడిపే ప్రిస్కూల్ సెంటర్లలో చిన్నారులకు మూడేళ్ల నాణ్యమైన ప్రిస్కూల్ ఎడ్యుకేషన్ అందేలా ఇది చేస్తుంది’ అని విద్యాశాఖ అధికారి తెలిపారు.

ఒకటో తరగతిలో అడ్మిషన్ ఇచ్చే సమయంలో విద్యార్థి వయసు ఆరేళ్లు లేదా అంతకు మించి ఉండేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిందని ఆ అధికారి చెప్పారు. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలనే నిబంధనను అమలు చేస్తున్నారు.

తెలంగాణతోపాటు అసోం, గుజరాత్, పుదుచ్చేరి, లడఖ్ లాంటి రాష్ట్రాల్లో ఐదో ఏట అడుగుపెట్టిన చిన్నారులకు ఒకటో తరగతిలో అడ్మిషన్ ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో ఐదేళ్లు దాటితేనే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

నూతన విద్యావిధానం 2020 ప్రకారం.. పాఠశాల విద్యా విధానం 5+3+3+4 తరహాలో ఉంది. తొలి ఐదేళ్లలో.. మూడేళ్ల ప్రి స్కూల్ దశ ఉంటుంది. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఈ దశలో విద్యను అభ్యసిస్తారు. ఆరు నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు ఒకటి, రెండు తరగతులు చదువుతారు. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను పొందే హక్కుంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.