యాప్నగరం

రూ.26కే కిలో ఉల్లి.. కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కేంద్రం ఉపశమన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి ఉల్లి దిగుమతిని పెంచడంతో పాటు వేగవంతం చేయడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 24 Oct 2020, 9:27 am
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, గొడౌన్‌లలో నిల్వచేసిన సరుకు కుళ్లిపోవడంతో ఉల్లిధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డలు రూ.150 వరకు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఉల్లి దిగుమతుల నిబంధనలను కేంద్రం సడలించింది. తాజాగా ముందస్తు నిల్వల (బఫర్‌ స్టాక్‌) నుంచి ఉల్లిని తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీలా నందన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu కొండెక్కిన ఉల్లి
Representative Image


అసోం, ఏపీ, బిహార్‌, చండీగఢ్‌, హరియాణా, తెలంగాణ, తమిళనాడు ఈ నిల్వల నుంచి 8,000 టన్నులు తీసుకొంటున్నాయని, ఇతర రాష్ట్రాల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో నిల్వ చేసిన బఫర్ స్టాక్‌ సేకరణ ధరకే (రూ.26-28) కేంద్రం సరఫరా చేస్తుందన్నారు. ఆయా రాష్ట్రాలకు నేరుగా సరఫరా కావాలంటే కిలో రూ.30 చొప్పున ఇస్తామని అన్నారు.

ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించిన కేంద్రం.. టోకు వర్తకులు 25 మెట్రిక్‌ టన్నులు, చిల్లర వర్తకులు రెండు మెట్రిక్‌ టన్నులకు మించి నిల్వ చేయడానికి వీల్లేదని తెలిపింది. డిసెంబర్‌ 31 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వ్యాపారులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. కేంద్రం వద్ద ప్రస్తుతం 25వేల టన్నుల ముందస్తు నిల్వలు ఉన్నాయని, ఇవి నవంబరు తొలివారంలో నిండుకుంటాయని నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ చద్ధా శుక్రవారం అన్నారు. ప్రస్తుతం ఉల్లి ధరలు భారీగా పెరగడంతో ఈ బఫర్ స్టాక్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అత్యవసర సమయాల్లో వినియోగానికి ముందస్తు నిల్వలు ఉపయోగిస్తారు. ఈ ఏడాది లక్ష టన్నుల వరకు ఉల్లిగడ్డలను నిల్వచేశారు.

ఇప్పటి వరకు 43,000 టన్నులు ఈ బఫర్ స్టాక్ నుంచి వివిధ రాష్ట్రాలకు పంపారు.. కొంత వృధా కాగా.. మరో 25వేల టన్నులు ఉన్నాయని చద్ధా తెలిపారు. ప్రస్తుతం వీటిని కిలో రూ.26కే అందజేస్తామని, అదనంగా రవాణ ఛార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.