యాప్నగరం

మా ప్రాంతాల్లో మోదీ ఎలా పర్యటిస్తారు: చైనా

అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎలా పర్యటిస్తారని మండిపడింది.

TNN 16 Feb 2018, 9:13 am
తాము దక్షిణ టిబెట్‌గా భావించే అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎలా పర్యటిస్తారని చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. అరుణాచల్‌లో గురువారం పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దీంతో చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు దక్షిణ టిబెట్‌లో భాగమని వాదిస్తూ, ఇది వివాదాస్పద ప్రాంతమని పేర్కొంటోంది. భారత్‌తో సరిహద్దుల విషయంలో తమ వైఖరి ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ వ్యాఖ్యానించాడు. మోదీ అరుణాచల్‌లో పర్యటించడంపై దౌత్యపరమైన నిరసనలు చేపడతామని తెలిపారు.
Samayam Telugu china objects to prime minister narendra modis arunachal pradesh visit
మా ప్రాంతాల్లో మోదీ ఎలా పర్యటిస్తారు: చైనా


సరిహద్దులోని కొన్ని ప్రాంతాలు తమవేనని, వాటిని అరుణాచల్‌ప్రదేశ్‌విగా ఎప్పుడు గుర్తించలేదని మరోసారి ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఈ వివాదస్పద ప్రాంతాల్లో భారత అధికారులు పర్యటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో ఇరు దేశాలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉందని జెంగ్ షువాంగ్ తెలియజేశారు. సరిహద్దు విషయంలో ఇరు దేశాలూ ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని, భారత్ కూడా దీనికి కట్టుబడితే మంచిదని, లేదంటే సమస్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

గురువారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని ఇటానగర్‌లో సివిల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. టోమో రిబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ భవనంలో అకడమిక్ బ్లాక్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అంతర్గత భద్రత, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ లాంటి సమస్యలతో సతమతమవుతోన్న పాక్, వాటి నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మళ్లించడానికే ఉగ్రవాదులను దేశంపై ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ జైహింద్ అని పలుకరించుకోవాలని ప్రధాని సూచించారు. న్యూఢిల్లీ-సహర్లాగున్ ఎక్స్‌ప్రెస్ రైలు పేరు అరుణాచల్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం త్రిపుర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. రెడ్ సిగ్నల్ చూసి వాహనాలు ఆగిపోయినట్లు, త్రిపురలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందని ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.