యాప్నగరం

సార్వభౌమత్వం జోలికి వస్తే సహించం

సార్వభౌమత్వం విషయంలో చాలా సున్నితంగా ఉండే చైనా ఆహ్వానాన్ని.. సార్వభౌమత్వం అతిక్రమణకు గురైన మరో దేశం ఎలా మన్నించగలుగుతుంది

TNN 23 Feb 2017, 6:35 pm
సీపెక్ (చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్) భారతదేశ సార్వభౌమత్వాన్ని అతిక్రమిస్తోందనీ, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా వెళుతోందనీ.. ఈ నేపథ్యంలో భారత్, సిల్క్ రోడ్ సమ్మిట్‌లో ఎలా పాల్గొనగలదో చైనానే వివరించాలని ఆ దేశాన్ని ప్రశ్నించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ తెలిపారు. చైనా-భారత్ సంబంధాల బలోపేతం అంశంపై బీజింగ్‌లో నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన పత్రికా విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.
Samayam Telugu china pakistan economic corridor violates our sovereignty india tells beijing
సార్వభౌమత్వం జోలికి వస్తే సహించం


బీజింగ్‌లో నిర్వహించనున్న ‘సిల్క్ రోడ్ సమ్మిట్‌’లో పాల్గొనాల్సిందిగా చైనా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందనీ, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ‘సార్వభౌమత్వం విషయంలో చాలా సున్నితంగా ఉండే చైనా ఆహ్వానాన్ని.. సార్వభౌమత్వం అతిక్రమణకు గురైన మరో దేశం ఎలా మన్నించగలుగుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘దీని గురించి ఎవరు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారో చూడాలి. మేం.. మా అభ్యంతరాలను నిర్మొహమాటంగా వారి ముందుంచాం. వీటి గురించి పబ్లిక్‌గానూ మాట్లాడతాం. ఎందుకంటే మాది సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం’ అని ఆయన పేర్కొన్నారు.

భారత్ అన్ని దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్న దేశం అనీ, సంబంధాలను బలోపేతం చేసే అన్ని రకాల కార్యక్రమాల్లో ఇండియా చురుగ్గా పాల్గొంటుందని ఆయన చైనాకు తెలిపినట్లు చెప్పారు. మయన్మార్‌తో కాలాదాన్, ఇరాన్‌తో చాబహార్ పోర్ట్, రష్యాతో నార్త్ సౌత్ కారిడార్ ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యాన్ని ఉదహరించినట్లు ఆయన తెలిపారు. బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్ (బీసీఐఎం) కారిడార్‌లో భారత్ ప్రధాన భాగస్వామిగా ఉన్న విషయాన్ని గుర్తు చేసినట్లు ఆయన వెల్లడించారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. మల్టీ బిలియన్ డాలర్ ‘వన్ బెల్ట్.. వన్ రోడ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సిల్క్ రోడ్ సమ్మిట్ పేరుతో దీనికి సంబంధించి మే నెలలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి హాజరవనున్నట్లు ఇప్పటికే 20 దేశాల నాయకులు తెలిపారు. చైనా ‘సిల్క్ రోడ్ ఇనిషియేటివ్‌’లో బీసీఐఎం కూడా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.