యాప్నగరం

భారత సరిహద్దుకు సమీపంగా చైనా యుద్ధ విమానం.. మళ్లీ కవ్వింపులు

Line of Actual Control: సరిహద్దులో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత సైన్యం అప్రమత్తం కావడంతో ఆ విమానం వెనక్కి వెళ్లిపోయిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై చైనాకు హెచ్చరికలు చేశామని ఆయన తెలిపారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 9 Jul 2022, 12:58 am
భారత సరిహద్దులో చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనాకు చెందిన యుద్ధ విమానం ఒకటి వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి అతి సమీపానికి వచ్చింది. అప్రమత్తమైన భారత సైన్యం తమ బలగాలను అప్రమత్తం చేయడంతో ఆ విమానం (Chinese Aircraft) వెనక్కి వెళ్లిపోయిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. జూన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిహద్దు ప్రాంతంలో మోహరించిన వైమానిక దళ రాడార్ ద్వారా చైనా విమానాన్ని గుర్తించినట్లు ఆ అధికారి వివరించారు.
Samayam Telugu China Aircraft (File Photo)
చైనా యుద్ధ విమానం (ఫైల్ ఫొటో)


కొంతకాలంగా కిమ్మనకుండా ఉన్న డ్రాగన్ మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు వెంట నిబంధనలను అతిక్రమిస్తోంది. తూర్పు లఢక్ సెక్టార్‌ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గగనతల సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. తూర్పు లడఖ్‌కు సమీపంలో చైనా వైమానిక దళం నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో భారీ కసరత్తు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన వివరించారు.

ఈ విషయంపై చైనాకు భారత ప్రభుత్వం హెచ్చరికలు చేసిందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ అధికారి వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించారని, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చైనాకు సూచించినట్లు తెలిపారు.

2020లోనూ చైనా సైన్యం ఇలాగే వరుస కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఫలితంగా అది గాల్వాన్‌లో ఘర్షణలకు దారి తీసింది. 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనా వైపు రెట్టింపు నష్టం జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.