అగస్టా కుంభకోణంతో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని అరెస్ట్ చేసి విచారించే ధైర్యం బీజేపీకి లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. రూ.3600 కోట్ల విలువైన అగస్టా వెస్ట్ ల్యాండ్ చోపర్ డీల్ కు సంబంధించి ఇటలీ కోర్టులో ప్రస్తావనకు వచ్చిన సోనియాను, ఈ అంశంతో సంబంధం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెదవి విప్పకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మోడీ ఎందుకని మౌనం వహిస్తున్నారు..? ఆయా నేతల గృహాలపై సీబీఐ దాడులకు ఆయన ఎందుకు ఆదేశాలివ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఇలాంటి చర్యలకు దిగదని తనకు ఎప్పుడోతెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు పైకి ఘర్షణ పడుతున్నప్పటికీ అంతర్గతంగా రెండింటి రక్తం ఒకటేనని ట్విట్టరులో విమర్శించారు.
దమ్ముంటే సోనియాను అరెస్ట్ చేయలి: కేజ్రీవాల్
అగస్టా వ్యవహారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాని అరెస్ట్ చేసే ధైర్యం బీజేపీకి లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
TNN 29 Apr 2016, 7:15 pm