యాప్నగరం

నా తండ్రి మధ్యాహ్న భోజనం కాజేస్తున్నాడు.. కలెక్టర్‌కు బాలిక ఫిర్యాదు, కంటతడి పెట్టిస్తున్న ఘటన

Girl complaint on Father: ఒడిశాలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక తన తండ్రిపై కలెక్టరుకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. తల్లి లేని ఆ అమ్మాయి ఆవేదన కంటతడి పెట్టిస్తోంది.

Samayam Telugu 17 Nov 2020, 10:13 pm
ఆరో తరగతి చదువుతున్న ఓ చిన్నారి తన తండ్రిపై కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఆలోచింపజేస్తోంది. బాలిక తల్లి రెండేళ్ల కిందట మరణించడంతో ఆమె తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఆలనా పాలనను పట్టించుకోలేదు. నిరాధారణకు నోచుకోవడంతో మేనమామ ఇంట్లో ఆశ్రయం పొంది అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. మిడ్ డే మీల్ పథకం కింద మధ్యాహ్న భోజన ఖర్చులకు సంబంధించి పాఠశాల అందిస్తున్న చిన్న మొత్తం, ఆమె పేరు మీద ఇస్తున్న బియ్యంపైనా ఆ తండ్రి కన్నేశాడు. ఆ బాలికకు తెలియకుండా కాజేస్తున్నాడు.
Samayam Telugu కన్నతండ్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న బాలిక
Class 6 girl walks 10km to file complaint against dad in Odisha


ఆ విషయం గుర్తించిన బాలిక జిల్లా కలెక్టర్‌‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అందుకోసం 10 కి.మీ. దూరం కాలినడకన వచ్చింది. ఒడిశాలోని కేంద్రపారాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి లేని పిల్లను కంటికి రెప్పలా కాపాడాల్సిందిపోయి, ఆ కన్నతండ్రి ఆమెకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని కూడా దక్కకుండా చేస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది.

కరోనా కారణంగా 8 నెలలుగా పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే.. ఒడిశా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందేలా కృషి చేస్తుంది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.8 చొప్పున అందిస్తున్నారు. విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ ఉంటే నేరుగా ఆ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. లేకపోతే.. గార్డియన్‌గా ఉన్నవారి బ్యాంక్ అకౌంట్లో ఆ మొత్తం వేస్తున్నారు. దీంతో పాటు ఒక్కో విద్యార్థికి రోజుకు 150 గ్రాముల చొప్పున బియ్యాన్ని నెలకు ఒకసారి పాఠశాలలో పంపిణీ చేస్తున్నారు.

కేంద్రపారకు చెందిన ఓ బాలిక సోమవారం (నవంబర్ 16) జిల్లా కలెక్టర్‌ను కలిసి ఓ లేఖ అందజేసింది. ప్రభుత్వం తనకు ఇచ్చే మిడ్ డే మీల్ స్కీమ్‌లోని 150 గ్రాముల బియ్యంతో పాటు, ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తున్న రూ.8ల మొత్తాన్ని గార్డియన్ ఉన్న తన తండ్రి అక్రమంగా తీసుకుంటున్నారని ఆరోపించింది. తల్లి మరణించడంతో తాను తన మేనమామ వద్ద ఉంటున్నట్లు గోడు వెల్లబోసుకుంది.

వీడియో: కలెక్టర్‌కు ఫిర్యాదు లేఖ ఇస్తున్న బాలిక

బాలిక పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. ఆమె తండ్రి పాఠశాలలో తనకు సంబంధించిన అకౌంట్ డిటేల్స్ ఇచ్చాడు. గార్డియన్ పేరుతో ప్రభుత్వం ఇచ్చే ఆ 8 రూపాయలను కాజేస్తున్నాడు. పాఠశాలలో తన కుమార్తె పేరు చెప్పి బియ్యాన్ని తీసుకెళుతున్నాడు.

బాలిక సమస్య విన్న కలెక్టర్ సమర్థ్ వర్మ చలించిపోయారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణ చర్యలకు ఆదేశించారు. బాలికకు అందజేసే సాయాన్ని ఇకపై ఆమెకు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు.. ఇప్పటిదాకా ఆమె తండ్రి అక్రమంగా తీసుకున్న వాటిని రికవరీ చేయించి బాలికకు ఇప్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read:

గంటల తరబడి మొబైల్ గేమ్‌ ఆడి యువకుడి మృతి

తగ్గుతున్న కరోనా.. 30 వేలకు దిగువన కేసులు, గొప్ప ఊరట

కలెక్టర్‌పై హత్య కేసు.. ఒడిశాలో సంచలన ఘటన

తొలిచూపులోనే ప్రేమ.. కానీ, ఆ సంతోషం ఎన్నో రోజులులేదు, బైడెన్ జీవితంలో విషాద ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.