యాప్నగరం

అసెంబ్లీలో గుజరాత్ ఎమ్మెల్యేల వీరంగం.. కాంగ్రెస్, బీజేపీ నేతల కొట్లాట

​ తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేసిన రచ్చను తలదన్నేలా.. బుధవారం గుజరాత్ శాసనసభలో ఎమ్మెల్యేలు బాహాబాహి తలపడ్డారు.

TNN 14 Mar 2018, 3:46 pm
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేసిన రచ్చను తలదన్నేలా.. బుధవారం గుజరాత్ శాసనసభలో ఎమ్మెల్యేలు బాహాబాహి తలపడ్డారు. వీళ్లా మన ప్రజాప్రతినిధులు అని ప్రజలు తలదించుకునేలా.. ఒకరిపై మరొకరు దాడికి దిగారు. బీజేపీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యుడు ప్రతాప్ దుధాత్ మైక్రోఫోన్‌తో దాడికి దిగాడు. దీంతో అసెంబ్లీ టర్మ్ ముగిసే వరకూ అతడిపై స్పీకర్ రాజేంద్ర త్రివేది సస్పెన్షన్ వేటు వేశారు.
Samayam Telugu congress bjp mlas come to blows in gujarat assembly
అసెంబ్లీలో గుజరాత్ ఎమ్మెల్యేల వీరంగం.. కాంగ్రెస్, బీజేపీ నేతల కొట్లాట


జామ్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాడమ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి ప్రయత్నించగా.. ఆయనకు అవకాశం కల్పించకపోవడం గొడవకు కారణమైంది. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని విక్రమ్ పదేపదే ప్రయత్నించారు. కానీ స్పీకర్ ఆయనకు బదులుగా కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే శైలేష్ పర్మార్‌కు అవకాశం కల్పించారు. దీంతో విక్రమ్ ఆందోళనకు దిగారు.

ఈ విషయం గమనించి పర్మార్.. విక్రమ్‌కు ప్రశ్నించే అవకాశం కల్పించడం కోసం తాను సీట్లో కూర్చున్నారు. కానీ స్పీకర్ మాత్రం విక్రమ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ తీరుకు నిరసనగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు విర్జి తుమ్మార్, అమ్రిష్ డేర్ వెల్‌లోకి దూసుకెళ్లారు.

విక్రమ్ మాట్లాడటానికి ఎందుకు అవకాశం కల్పించడం లేదని అమ్రిష్ స్పీకర్‌ను నిలదీశారు. ఆయన మాట్లాడితే మీకేంటి నష్టమంటూ తీవ్ర స్వరంతో స్పీకర్‌ను ప్రశ్నించడంతో.. సభలో అలా మాట్లాడొద్దని సభాధ్యక్షుడు హెచ్చరించారు. స్పీకర్ వారిద్దర్నీ ఒక రోజుపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు.
దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ దుధాత్ ఆగ్రహంతో ఊగిపోయారు. వేరే సభ్యుడి దగ్గర నుంచి మైక్రో ఫోన్ లాక్కొని బీజేపీ ఎమ్మెల్యే నికోల్ జగ్దీష్ పంచల్‌ మీదకు దాడికి దిగారు.

వెంటనే అప్రమత్తమై అసెంబ్లీ సర్జంట్స్.. ప్రతాప్‌ను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు. కానీ మరో ద్వారం నుంచి లోపలికి వచ్చిన ప్రతాప్.. వెనుక నుంచి పంచల్‌పై దాడికి దిగాడు. సహచరుడి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీజేపీ శాసనసభ్యులు దాడికి దిగారు. ప్రతాప్‌ను నేల మీద ఈడ్చుకెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి ఆయన్ను చితకబాదారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.