యాప్నగరం

Madhya Pradesh: హత్యాయత్నం కేసులో బెయిల్‌పై విడుదలైన కార్పొరేటర్‌కి పాలాభిషేకం

మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) హత్యానేరం కేసులో బెయిల్‌పై విడుదలైన ఓ కాంగ్రెస్ కార్పొరేటర్‌కు అతని మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. డప్పులతో స్వాగతించడమే కాకుండా.. ఏకంగా పాలతో అభిషేకం కూడా చేశారు. ఇండోర్ కార్పొరేటర్ రాజు భడోరియాకు ఈ స్వాగతం లభించింది. అయితే ఈ చర్యపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిందితులను ఈ విధంగా గౌరవిస్తూ.. రాజకీయాలను నేర పూరితం చేస్తుందని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపడేసింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 25 Aug 2022, 3:16 pm
Madhya Pradesh: బిల్కిస్ బానో కేసులో విడుదలై వచ్చిన నిందితులకు హారతి ఇచ్చి.. ఆహ్వానించిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఓ హత్యానేరం‌పై జైలుకు వెళ్లిన వ్యక్తికి పాలాభిషేకం చేశారు. ఇది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇండోర్ కార్పొరేటర్ రాజు భడోరియాకు.. ఓ బీజేపీ కార్యకర్తను చంపడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో జైలుపాలయ్యారు.
Samayam Telugu Milk Bath to Congress corporator


రాజు బెయిల్‌పై రావడంతో అతని మద్దతుదారులు.. పాలతో స్నానం చేయించారు. అంతటితో ఆగకుండా డప్పులు కొట్టి ఘనంగా స్వాగతం పలికారు. అయితే రాజు భడోరియాకు లభించిన ఈ స్వాగతానికి సంబంధించిన కొన్ని ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నేరానికి పాల్పడిన వ్యక్తిని కీర్తిస్తోందని, రాజకీయాలను నేరపూరితం చేయడంలో మునిగిపోయిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు.

ఈ ఏడాది జూలై 13న రాజస్థాన్‌లోని కోటాలో ఇండోర్ సివిక్ ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చందురావ్ షిండేను హత్య చేసేందుకు ప్రయత్నించినందుకు భడోరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. భడోరియాపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదైంది. అయితే ఆయన బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన రాగానే అతని మద్దతుదారులు ఇంత హడావిడి చేశారు.


ఓ హత్యా నేరం కేసులో నిందితుడిని కీర్తించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను నేరపూరితం చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి ఉమేష్ శర్మ విమర్శించారు. అయితే ఈ విమర్శలను కాంగ్రెస్ పార్టీ నేతలు తోసిపుచ్చారు. బీజేపీ ఆదేశించడం బట్టే.. రాజు భడోరియాపై తప్పుడు కేసు పెట్టారని కాంగ్రెస్ నేత నీలభ్ శుక్లా అన్నారు. షిండేపై దాడి జరిగినప్పుడు భడోరియా ఘటనా స్థలంలో లేరని శుక్లా చెప్పారు. అయితే రాజు భడోరియా వార్డు నెంబర్ 22కు జరిగిన ఎన్నికల్లో జూలై 17న కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన జైల్లోనే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.