యాప్నగరం

Navjot Singh Sidhu 6 నెలల్లోనే 34 కిలోలు తగ్గిన సిద్ధూ.. జైల్లో ఉన్న ఆయనకు ఎలా సాధ్యమైంది?

Navjot Singh Sidhu 34 ఏళ్ల కిందట తన స్నేహితుడితో కలిసి ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి చావుకు కారణమైన కేసులో సిద్ధూ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బాధితుల న్యాయపోరాటంతో సుప్రీంకోర్టు అతడికి ఈ ఏడాది మేలో శిక్ష ఖరారు చేసింది. 1988 డిసెంబరు 27న సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపిందర్‌ సింగ్‌ సంధూ పటియాలాలో రోడ్డు మధ్యలో జిప్సీ నిలిపి గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో గొడవ పడ్డారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 29 Nov 2022, 7:02 am

ప్రధానాంశాలు:

  • ఓ కేసులో నవజోత్ సిద్ధూకి ఏడాది జైలు శిక్ష
  • పటియాలా జైల్లో క్లర్క్‌గా కాంగ్రెస్ నేత విధులు
  • బరువు తగ్గడానికి రోజూ యోగా, మెడిటేషన్‌
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Navjot Singh Sidhu
Navjot Singh Sidhu 34 ఏళ్ల నాటి కేసులో పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ పటియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత ఆరు నెలలుగా జైల్లో ఉన్న ఆయన ఏకంగా 34 కిలోల బరువు తగ్గినట్టు సిద్ధూ సన్నిహితులు వెల్లడించారు. సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు.. అక్కడ భోజనం తదితర కారణాల వల్ల బరువు తగ్గుతారు. కానీ, ఆరు నెలల్లోనే 34 కేజీలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. సిద్ధూ ఓ ప్రణాళిక ప్రకారం తన బరువు తగ్గించుకున్నారని ఆయన్ని కలిసేందుకు వెళ్లిన సన్నిహితులు, మాజీ ఎమ్మెల్యే నవతేజ్‌ సింగ్‌ చీమా తెలిపారు.
సిద్దూ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించిన ఆయన.. 6.2 అడుగుల ఎత్తున్న తమ నేత ప్రస్తుతం 99 కిలోల బరువు ఉన్నట్లు చెప్పారు. క్రికెటర్‌గా ఉన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో సిద్దూ ఎలా కనిపించేవారో..ఇప్పుడు అలాగే ఉన్నారని పేర్కొన్నారు. రోజులో ఆయన కనీసం నాలుగు గంటల పాటు ధ్యానం, మరో రెండు గంటలు యోగా, వ్యాయామాలు చేస్తున్నారని తెలిపారు. దాదాపు 2 నుంచి 4 గంటల పాటు పుస్తకాలు చదువుతున్నారని, కేవలం 4 గంటలపాటే నిద్రపోతున్నారని నవతేజ్‌ అన్నారు.

‘‘ఏడాది జైలు శిక్ష పూర్తి చేసుకుని నవజోత్‌ సింగ్‌ సిద్ధూ బయటకి వచ్చే సరికి అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం... క్రికెటర్‌గా ఉన్నప్పుడు ఆయన ఎంత దృఢంగా, అందంగా ఉండేవారో అలాగే కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఆయన 34 కిలోల బరువు తగ్గారు.. ఇంకా తగ్గే అవకాశం ఉంది’’ అని నవతేజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఆయన్ను చూసిన తర్వాత చాలా సంతోషం కలిగిందన్నారు.

కాగా, నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడుతున్న సిద్దూకు ప్రత్యేక ఆహారపు అలవాట్లను పాటించాలని వైద్యులు గతంలో సూచించారు. ఈ మేరకు ఆయన ఆహార నియమాలు పాటిస్తున్నట్లు నవతేజ్‌ చెప్పారు. రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేస్తున్నారని, ఆహారంగా కొబ్బరి నీళ్లు, బాదం పాలు తీసుకుంటున్నారని తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం రోజులో కొన్ని గంటల పాటు సిద్ధూ క్లర్క్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.

1988లో జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో సిద్ధూను రూ.1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని ఈ ఏడాది మే నెలలో తీర్పు చెప్పింది. 1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్‌ విషయంపై 65 ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌ అనే వ్యక్తితో సిద్ధూ, స్నేహితుడు రూపిందర్‌ సింగ్‌లు గొడవకు దిగారు. ఇది ఘర్షణకు దారితీయడంతో తీవ్రంగా గాయపడిన గుర్నామ్‌ సింగ్‌ ఆస్పత్రితో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో తొలుత పటియాలా కోర్టు సిద్ధూను నిర్దోషిగా ప్రకటించగా.. బాధితులు పంజాబ్ హరియాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సిద్ధూకు తీర్పు వ్యతిరేకంగా రావడంతో సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు జరిమానాతో సరిపెట్టడంతో బాధితులు రివ్యూ పిటిషన్ వేయడంతో చివరకు సిద్ధూ జైలుకు వెళ్లారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.