యాప్నగరం

పరువు నష్టం కేసు: మరీ ఇంత పెద్ద శిక్షా? సెషన్స్ కోర్టులో రాహుల్ వాదన

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలారులో కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం గురించి ప్రస్తావించారు. ఈ సమయంలో మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్‌ కోర్టులో వాదనలు వినిపించారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 14 Apr 2023, 10:09 am

ప్రధానాంశాలు:

  • సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ వాదనలు
  • తీవ్రమైన వ్యాఖ్యలు కాదన్న లాయర్
  • కర్ణాటకలో వ్యాఖ్యలు చేస్తే గుజరాత్‌లో కేసు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rahul Gandhi
మోదీ ఇంటిపేరుపై పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏప్రిల్ 14 వరకూ సూరత్ రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రాముల్ పిటిషన్‌పై గురువారం వాదనలు పూర్తిచేసిన సూరత్‌ సెషన్స్‌ కోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది. ఏప్రిల్‌ 20న తీర్పు వెల్లడించనున్నట్టు పేర్కొంది. అంతకుముందు రాహుల్‌ తరఫు న్యాయవాది ఆర్‌ఎస్‌ చీమా వాదనలను వినిపించారు. ట్రయల్‌ కోర్టులో విచారణ పారదర్శకంగా జరగలేదని, గరిష్ఠ శిక్ష వేయాల్సినంత కేసు కాదని తెలిపారు.
‘సందర్భానుసారంగా సాగిన రాహుల్ ప్రసంగంలో పరువు నష్టం కలిగించేంత తీవ్రమైన వ్యాఖ్యలు లేవు.. భూతద్దంలో పెట్టి చూస్తే తప్పా.. ప్రాథమికంగా మన ప్రధానిని తీవ్రంగా విమర్శించే ధైర్యం చేసినందుకు ఆయనపై వ్యాజ్యం వేశారు’ అని ఆయన వాదించారు. అలాగే, ఫిర్యాదుదారుడి (పూర్ణేష్ మోదీ) భౌగోళిక అధికార పరిధిని లేవనెత్తిన చీమా.. రాహుల్ కోలార్‌లో ప్రసంగం చేశారని, వాట్సాప్‌లో అతడికి సందేశం వచ్చిందని చెప్పారు.

‘మీరు పంజాబీలు గొడవ పడేవారని, దుర్భాషలాడుతున్నారని ఎవరైనా అంటే నేను వెళ్లి పరువు నష్టం కేసు పెట్టవచ్చా? అలాంటి పదాలు గుజరాతీలు, ఇతర భాషా సమూహాలు, మతపరమైన సంస్థలు మొదలైనవాటి కోసం తరచుగా ఉపయోగిస్తాం.. ఉదయం 11:51 గంటలకు నా క్లయింట్ దోషిగా ప్రకటించబడ్డారు.. అరగంటలో అతనికి కఠినమైన, గరిష్ట శిక్ష విధించారు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నామని ట్రయల్ కోర్టు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.. నన్ను క్షమించండి, నేను బలమైన పదాలను ఉపయోగిస్తున్నాను కానీ న్యాయమూర్తిని తప్పుదారి పట్టించారు.. కఠినంగా ప్రవర్తించారు’ అని చీమా వాదించారు.

నవంబరు 2019లో ‘చౌకీదార్ చోర్’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారని, మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలను అదే ఏడాది ఏప్రిల్‌లో చేశారని గుర్తుచేశారు. ‘కాబట్టి నాకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిందని ఫిర్యాదుదారు చెప్పిన వివరాలపై న్యాయమూర్తి ఎలా ఆధారపడతారు’ చీమా ప్రశ్నించారు.

కాగా, రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పు అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. వీర్‌ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ బుధవారం పుణేలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.