యాప్నగరం

Sonia Gandhi: ఈడీ కార్యాలయానికి సోనియా గాంధీ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

Congress Party: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈడీ బృందం సోనియా గాంధీని సుమారు 2 గంటల పాటు ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమె విజ్ఞప్తి మేరకు విచారణ నిలిపివేసింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 21 Jul 2022, 3:38 pm
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం సోనియాను సుమారు 2 గంటల పాటు ప్రశ్నించింది. విచారణ బృందంలో ఒక మహిళా అధికారి ఉన్నారు. ఈడీ విచారణ నిమిత్తం గురువారం (జులై 21) ఉదయం 11.30 గంటల సమయంలో సోనియా గాంధీ.. ఢిల్లీలోని తన నివాసం నుంచి బయల్దేరారు. సోనియా వెంట ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. అప్పటికే సోనియా నివాసానికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Samayam Telugu Sonia Gandhi
సోనియా గాంధీ


అటు పార్లమెంట్‌ ఉభయ సభలు కూడా ఈ అంశంపై అట్టుడుకాయి. కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై కావాలనే కక్షపూరిత చర్యలకు దిగుతోందంటూ లోక్ సభ ప్రారంభం కాగానే.. విపక్షాలకు చెందిన సభ్యులు ఆందోళనకు దిగారు. గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్ సభను వాయిదా వేశారు.

అంతకుముందు లోక్ సభ ప్రారంభం కావడానికి ముందు విపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ పార్లమెంట్ హాల్‌లో సమావేశమయ్యారు. విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడుల గురించి చర్చించారు. కలిసికట్టుగా దీనిపై గళం వినిపించాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు.


దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బిహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.