యాప్నగరం

అధికారుల సమన్వయలోపం.. ఒక్క ఫోన్ చేసుంటే ఆ 16 మంది ప్రాణాలు దక్కేవి

లాక్‌డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలు వందల కిలోమీటర్ల కాలినడక వెళ్లడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలా కాలినడక వెళ్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన 16 మంది రైలు కింద నలిగిపోయారు.

Samayam Telugu 10 May 2020, 7:40 am
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 16 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కార్మికుల కాలినడక రైలు పట్టాల వెంబడి తమ సొంతూళ్లకు వెళుతుండగా రాత్రి కావడంతో ఔరంగాబాద్ వద్ద విశ్రాంతి తీసుకున్నారు. నడిచి నడిచి అలసిపోవడంతో పట్టాలపై నిద్రపోయిన వలస జీవులను గూడ్సు రైలు బలితీసుకుంది. అయితే, ఈ ప్రమాదం రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపానికి సంబంధించిన సందేహాలను లేవనెత్తుతోంది. మహారాష్ట్ర జల్నాలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గురువారం రాత్రి ఏడు గంటలకు తమ స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరారు.
Samayam Telugu ఔరంగాబాద్ ప్రమాదం


లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రప్పించే చర్యల పర్యవేక్షణకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారులను నియమించింది. ఇక, మహారాష్ట్రకు సంబంధించి గిరిజన వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దీపాలీ రస్తోగీ ఈ బాధ్యతలును నిర్వహిస్తున్నారు. అయితే, సంబంధిత అధికారులు ఎవరూ కార్మికులకు అందుబాటులో లేరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు కనీసం ఫోన్‌ ద్వారా అయినా అందుబాటులో ఉండి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేదని కాదని విమర్శిస్తున్నాయి.

‘మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వలస కార్మికుల వివరాలను నమోదు చేసిందా? నమోదు చేసినట్లయితే, వారిని సొంత రాష్ట్రానికి వెనక్కి తెచ్చేందుకు ఏ ప్రయత్నాలు చేశారు? ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ విషయంలో సిగ్గుపడాలి. జరిగిన ఘటనకు ఆయన బాధ్యత వహించాలి. మీడియా ముందు ప్రకటనలు ఇవ్వడానికి బదులు... ఇకనైనా సమర్ధవంతమైన చర్యలకు పూనుకోవాలి. ఈ దుర్ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలి.’ అని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. స్వరాష్ట్రాని వస్తున్న వలస కార్మికుల వివరాలను వెల్లడించాలని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కోరారు. ప్రభుత్వం వల్ల సాధ్యం కాకపోతే తామే వలస కూలీలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

కాగా, తాము దరఖాస్తు చేసి వారం దాటినా పాస్‌లు జారీ కాలేదు సరికదా కనీసం స్పందించలేదంటూ క్షతగాత్రుల్లో ఒకరు వాపోయారు. స్వగ్రామంలో వ్యవసాయ పనులు లేకపోవడంతో అక్కడికి వెళ్లిన తన కుమారుడు అధికారుల నిర్లక్ష్యానికి బలయ్యాడని మృతుడు రాజ్‌ బోర్హామ్‌ తండ్రి బోరున విలపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.