యాప్నగరం

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కన్నుమూత

అక్టోబర్ 1న అహ్మాద్ పటేల్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ కాగా.. మహమ్మారి నుంచి కోలుకున్నా అనారోగ్య సమస్యలను వేధించడంతో నెల రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Samayam Telugu 25 Nov 2020, 7:37 am
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్నా కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుది శ్వాసవిడిచారు. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న ఆయనకు అనారోగ్య సమస్యల వెంటాడటంతో నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మరణించారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
Samayam Telugu అహ్మద్ పటేల్


కరోనా నుంచి కోలుకున్న తర్వాత శరీరంలోని పలు అవయవాలు సరిగా పని చేయకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది.. దీంతో నవంబరు 15 నుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందజేశారని ఫైసల్ తెలిపారు. ప్రజలు అన్ని సందర్భాల్లోనూ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని ఫైసల్ సూచించారు.

కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న అహ్మద్‌ పటేల్‌ ఎనిమిది సార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్‌సభకు, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1976లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అహ్మద్ పటేల్.. అంచెలంచెలుగా కాంగ్రెస్‌లో ఎదిగారు. పార్టీ వ్యూహకర్తగా, వివాదాల పరిష్కారకర్తగా గుర్తింపు పొందారు.

అహ్మద్ పటేల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంలో ఆయన పాత్ర ఎన్నటికీ గుర్తిండిపోతుందని, తన తెలివితేటలతో ఎంతో ప్రసిద్ధి చెందారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘అహ్మద్ పటేల్ జీ మరణం ఎంతో కలిచివేసింది.. ఆయన జీవితాంతం సమాజ సేవ చేస్తూ ప్రజలతోనే గడిపారు. తన తెలివితేటలతో గుర్తింపు తెచ్చుకుని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన కుమారుడు ఫైసల్‌తో మాట్లాడి సంతాపం తెలిపాను. అహ్మద్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.